గల్ఫ్ బాధలకు చెక్: ఎన్నారై పాలసీపై కెటిఆర్ కసరత్తు
హైదరాబాద్: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే తెలంగాణ ఎన్నారైల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పాలసీ(విధానం) తీసుకురానుంది. ఈ పాలసీని రూపొందించే దిశగా ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన రాష్ట్ర ఐటీ, ఎన్నారై శాఖ మంత్రి కెటి రామారావు చర్యలు ప్రారంభించారు. ఈ పాలసీని ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ప్రయోజనం కలిగేలా రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
తెలంగాణలో యువత ఆకాంక్షలు ఫలించేలా ముఖ్యంగా గల్ఫ్ ఉపాధి వంటి సమస్యలకు పరిష్కారం దొరికేలా పాలసీ రూపొందించేందుకు మంత్రి ప్రత్యేక విధివిధానాలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు కేరళ, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్న ఎన్నారై పాలసీలను ఆయన స్వయంగా పరిశీలించారు. అందులోని ప్రధానమైన అంశాలను స్వీకరించాలని యోచిస్తున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే యువతకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఈ పాలసీ ఉండబోతోంది. ఇప్పటికే అధికారులతో చర్చలు నిర్వహించిన మంత్రి కేటీఆర్ వచ్చే వారంలో ఎన్నారై సంఘాలతో.. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని ఎన్నారైల కోసం పనిచేస్తున్న సంస్థలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కార్మికశాఖతోపాటు మరికొన్ని సంబంధిత ప్రభుత్వ శాఖాధికారులను కూడా హాజరుకావాల్సిందిగా మంత్రి సూచించారు.
విదేశాలకు వెళ్లే యువత మోసాలకు గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకోవడంపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ క్రమంలోనే విదేశాల్లో దురదృష్టవశాత్తు ప్రమాదాలకు గురైనవారికి, మరణించినవారికి అందాల్సిన సహాయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ క్రమంలో సంఘాలను, పలువురు ప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నారు.
గత కొన్నేళ్లుగా వీరు విదేశాల్లో కార్మికుల, ప్రవాస తెలంగాణ బిడ్డల ప్రయోజనం కోసం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వారినుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించనున్నారు. అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత పాలసీని తీసుకువచ్చే విధంగా మంత్రి కెటిఆర్ కసరత్తు చేస్తున్నారు.