తెలంగాణ సర్కార్కు కేంద్రం తీపి కబురు: 32 మంది తబ్లిగీ జమాతీలు రెడీగా ఉన్నారంటూ అసద్ లేఖ
హైదరాబాద్: కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న తెలంగాణలో ప్లాస్మా థెరపీని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సికంద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా విధానంలో కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు చికిత్సను అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్లాస్మాను దానం చేయడానికి 32 మంది తబ్లిగీ జమాతీలు కూడా సిద్ధంగా ఉన్నారంటూ హైదరాబాద్ లోక్సభ సభ్యుడు, అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సైతం కేసీఆర్ సర్కార్కు లేఖ రాశారు.
ప్లాస్మాను డొనేట్ చేయడానికి తెలంగాణకు చెందిన 32 తబ్లిగీ జమాతీలు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఒవైసీకి తెలియజేశారు. దీనితో ఆయన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్కు లేఖ రాశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల్లో పాల్గొని, వైరస్ బారిన పడిన 32 మంది ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని, వారంతా తమ ప్లాస్మాను డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఒవైసీ లేఖ రాశారు.
అదే సమయంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసింది. దీనితో- తబ్లిగీ జమాతీల నుంచి ప్లాస్మాను సేకరించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ను నివారించడానికి ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్లు గానీ, మందులు గానీ అందుబాటులో లేవు. ప్లాస్మా థెరపీ ద్వారా దీన్ని నయం చేయవచ్చని ఇది వరకు అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్) అధికారులు నిరూపించారు.
ఢిల్లీలోని సాకెత్ ప్రాంతానికి చెంది 49 సంవత్సరాల వ్యక్తికి ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా వైరస్ నుంచి విముక్తి కల్పించారు. ప్రస్తుతం అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్లాస్మా థెరపీ కాస్తా సక్సెస్ కావడంతో ఇక ఈ విధానంలోనే వైద్యం కొనసాగించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన వనరులు పరిమితంగా ఉండటం వల్ల ఈ విధానంలో వైద్య చికిత్సను యుద్ధ ప్రాతిపదికన చేపట్టలేకపోతోంది.
Recommended Video
కాగా- ప్లాస్మా థెరపీ ద్వారా వైద్యాన్ని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఏపీ ప్రభుత్వానికి కూడా అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. మంగళగిరిలోని ఎయిమ్స్లో ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స చేయడానికి కేంద్రం ఓకే చెప్పింది. హైదరాబాద్లో వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 800లకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి.