ఉత్తమ్ సన్యాసుల్లో కలిసిపోతారు: కేటీఆర్, రైతు బంధు పథకంపై శ్రవణ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ నేత, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం మండిపడ్డారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్లు కాలేరని, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీయకుంటే సన్యాసుల్లో కలిసిపోతారన్నారు.
ఉత్తమ్ మాటలు చెప్పడంలో దిట్ట అన్నారు. కాంగ్రెస్ పార్టీని మించిన గలీజ్ పార్టీ ఈ దేశంలో మరొకటి లేదన్నారు. రైతులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. రైతులపై కపట ప్రేమ చూపెడుతోందన్నారు.
కుంభకోణాలు, లంబకోణాలు లేని కాంగ్రెస్ నాయకుడు లేడని, అధికారంలో ఉన్నప్పుడు కమీషన్లు, కాంట్రాక్టులకే పరిమితమైన పార్టీ కాంగ్రెస్ అన్నారు. దేశంలో అందరికీ గుండు కొట్టించిందన్నారు. డెబ్బై ఏళ్లలో ఎవరూ చేయని విధంగా రైతు బంధు పథకంను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, ఈ పథకాన్ని దేశంలో తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
రైతు బంధు ప్రభుత్వంగా తమ సర్కార్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కాంగ్రెస్ను జనాలు నమ్మడం లేదన్నారు. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ రూ.2 లక్షలు చేస్తామంటే ప్రజలు నమ్మలేదని, రాహుల్ గాంధీ వచ్చి చెప్పినా నమ్మలేదన్నారు.
టీఆర్ఎస్పై దాసోజు శ్రవణ్ నిప్పులు
రైతుబంధు పథకం పెద్ద డ్రామా అని టీపీసీసీ జనరల్ సెక్రటరీ దాసోజ్ శ్రవణ్ మండిపడ్డారు. సెక్యూరిటీ ఫీచర్స్ లేకుండా కొత్త పాస్ పుస్తకాలను ప్రింట్ చేస్తున్నారని, రైతుల పేరిట రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారన్నారు.
పోడు భూములు సాగు చేసే రైతులకు పెట్టుబడి సాయం ఎందుకివ్వరని ప్రశ్నించారు. మిర్చి రైతులను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. కాగా, కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో రైతు బంధు పథకాన్ని కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. రైతులకు కొత్త పాస్ పుస్తకాలను ఆయన అందజేస్తారు. రైతు బంధు పథకం నేపథ్యంలో ఎకరా పొలానికి రైతుకు రూ.4వేలు ఇస్తారు.