ఇంకా బోరు బావిలోనే: చిట్టితల్లి కోసం రాష్ట్రమంతా ఎదురుచూపు.. సన్నగిల్లుతున్న నమ్మకం!
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో పడిపోయిన చిన్నారి విషయంలో పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నాయి. రెండు రోజులు గడుస్తున్నా.. రెస్క్యూ టీమ్స్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. అత్యాధునిక కెమెరాలకు సైతం పాప ఆచూకీ చిక్కకపోవడం.. 180అడుగుల లోతున బావిలో నీరు ఉండటంతో.. ఆశలు సన్నగిల్లుతున్న పరిస్థితి.
బావిలో నీటిని తోడేయడానికి అధికారులు మోటార్లను వినియోగిస్తున్నారు. నీటిని తోడేయడానికి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉండటంతో.. పాప పరిస్థితిపై ఆందోళన నెలకొంది. మరోవైపు రెస్క్యూ టీమ్ సహా ఓఎన్జీసీ, సింగరేణి, ఎన్టీఆర్ఎఫ్ అధికారులు పాపను వెలికితీయడానికి నిరంతరాయంగా పనిచేస్తున్నారు.
చిట్టి తల్లి క్షేమంగా బయటపడాలని!:
ఇంకా పేరు కూడా పెట్టని 14నెలల ఆ చిన్నారి కోసం ప్రస్తుతం రాష్ట్ర ప్రజలంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. క్షణ క్షణం ఉత్కంఠను రేకెత్తిస్తోన్న ఈ ఉదంతం చివరికి ఎలాంటి ముగింపుకు దారితీస్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే రెండు రోజులు గడిచిపోవడంతో.. పాప ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
215అడుగుల లోతున!:
బోరు బావిలో జారిపడ్డ పాప.. ప్రస్తుతం 215అడుగుల లోతున చిక్కుకున్నట్లు రెస్క్యూ టీమ్ గుర్తించింది. కాగా, గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో పాప బోరు బావిలో పడిపోగా రాత్రి 8 గంటల నుంచి అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. సాంకేతిక సహాయంతో పాపను బయటకు తీయాలని రోబోటిక్ హ్యాండ్ క్లిప్, చైన్ పుల్లింగ్ టెక్నాలజీ ఉపయోగించినా ఫలితం లేకపోయింది
సింగరేణి రెస్క్యూ టీమ్ వచ్చినా!:
సింగరేణి రెస్క్యూ టీమ్ రాకతో పాప బోరు బావి నుంచి బయటపడుతుందని ఆశించినా.. వారు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో తాడు సహాయంతోను పాపను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు కూడా విఫలమవడంతో.. బోరు బావిలో ఉన్న మోటారును బయటకు తీస్తే.. దాని సహాయంతో బాలిక బయటకు వస్తుందని ఆశించారు. కానీ మోటారు మాత్రమే బయటకు రాగా బాలిక మరింత లోతుకు పడిపోయింది.
బోరుకు సమాంతరంగా తవ్వకాలు:
తొలుత 37అడుగుల లోతులో బాలిక చిక్కుకున్నట్లు గుర్తించిన అధికారులు.. బోరు మోటారు ప్రయత్నం విఫలం కావడంతో 70అడుగుల లోతున చిన్నారి పడిపోయినట్లు గుర్తించారు. దీంతో నాలుగు హిటాచీలతో బోరుకు సమాంతరంగా తవ్వకాలు చేపట్టారు. గురువారం ఉదయం 11గం. నుంచి తవ్వకాలు మొదలుపెట్టగా.. పెద్ద పెద్ద బండరాళ్లు ప్రయత్నాలను మరింత జటిలం చేశాయి.
శుక్రవారం తెల్లవారుజామున:
శుక్రవారం తెల్లవారం జామున 3గం.కు తవ్వకాలను అధికారులు తాత్కాళికంగా నిలిపేశారు. చేసిన ప్రయత్నాలన్ని విఫలం కావడంతో బోరు పక్కన్నే సమాంతరంగా తవ్వకాలు ప్రారంభించారు. ఉదయం 11గం. నుంచి నాలుగు హిటాచీల ద్వారా పనులు చేపట్టారు. సాయంత్రం 3గం. సమయంలో వర్షం పడటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి.
చిన్నారి తండ్రి ఏమన్నారంటే?:
తమ కూతురు ఇంతటి ప్రమాదానికి గురవుతుందని ఊహించలేకపోయామని చిన్నారి తండ్రి యాదయ్య చెబుతున్నారు. రెండేళ్ల క్రితం వేసిన ఆ బోరులో.. నీళ్లు ఉన్నాయో లేదో అని తెలుసుకోవడానికి రెండు రోజుల క్రితమే సింగిల్ ఫేజ్ మోటారు దించినట్లు తెలిపారు. ఆ తర్వాత బోరు రంధ్రాన్ని ఓ కవరుతో కప్పి ఉంచామని, అయితే ఇంత ప్రమాదం జరుగుతుందనుకోలేదన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో తాను ఆవు పాలు పితుకుతున్నానని చిన్నారులు బయట ఆడుకుంటున్నారని యాదయ్య అన్నారు. కొద్దిసేపటికే తమ పెద్ద కూతురు వచ్చి.. చెల్లి బోరు బావిలో పడినట్లు చెప్పిందని పేర్కొన్నారు. హుటాహుటిన అధికారుల వద్దకు వెళ్లి.. పాపను బయటకు తీయాల్సిందిగా వేడుకున్నట్లు చెప్పారు.
భారీగా తరలొచ్చిన జనం.. యజమానిపై కేసు:
చిన్నారిని బయటకు తీసే క్రమంలో వందల కొద్ది అధికారులు తీవ్రంగా శ్రమిస్తుండటంతో ఇక్కారెడ్డి గూడెంలోని చుట్టుపక్కల జనమంతా అక్కడికి తరలివస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, పలువురు మంత్రులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఘటన గురించి తెలిసినప్పటి నుంచి మంత్రి మహేందర్ రెడ్డి.. అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా.. శనివారం నాడు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వ పర్యవేక్షణతో పాటు ప్రజలు కూడా కొంత బాధ్యాతయుతంగా ఉండాలన్నారు. అటు సీఎం కేసీఆర్ సైతం అధికారుల ప్రయత్నాలపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, బోరు బావిని పూడ్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన దాని యజమాని మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్-336కింద ఆయనపై కేసు నమోదైంది.