తెలంగాణ రాజ్భవన్లో కీలక పరిణామం: గవర్నర్ తమిళిసైకి వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.. వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్ అందుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్గా బాధ్యతలను స్వీకరించడానికి ఉద్దేశించిన అపాయింట్మెంట్ ఇది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దీన్ని జారీ చేశారు. పుదుచ్చేరి రాజ్భవన్ రెసిడెంట్ కమిషనర్, ఇతర అధికారులు దీన్ని తమిళిసైకి అందజేశారు. ఇప్పటిదాకా పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్గా పనిచేసిన కిరణ్ బేడి ఉద్వాసనకు గురైన నేపథ్యంలో.. ఆ స్థానంలో తమిళిసైకి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే.
రాత్రికి రాత్రి పెను మార్పు: తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కీలక బాధ్యతలు: రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు
వారెంట్ అఫ్ అపాయింట్మెంట్ తీసుకుని పుదుచ్చేరి రాజ్భవన్ అధికారులు ఈ మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చారు. సోమాజీగూడలోని రాజ్భవన్లో తమిళిసైతో భేటీ అయ్యారు. అనంతరం వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్ను ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా పుదుచ్చేరిలో నెలకొన్న పరిస్థితుల గురించి తమిళిసై ఆరా తీసినట్లు తెలుస్తోంది. కిరణ్ బేడి ఉద్వాసనకు గురి కావడానికి దారి తీసిన పరిణామాల గురించి అక్కడి అధికారులు ఆమె దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం.
మరో ఒకట్రెండు నెలల్లో పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో కిరణ్ బేడి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, ఏజెంట్గా వ్యవహరిస్తున్నారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ కొద్దిరోజులుగా ఆరోపణలను చేస్తూ వస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. వాటిని ఆధారంగా చేసుకుని రాష్ట్రపతి భవన్ ఈ నిర్ణయం తీసుకుంది. కిరణ్ బేడికి ఉద్వాసన పలకడాన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి స్వాగతించారు. దీన్ని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు.