మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
లాక్ డౌన్ పీరియడ్లో దాదాపు రెండు నెలలు మందుకు దూరమైన మందుబాబులకు లాక్ డౌన్ 3.0లో ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రభుత్వం వైన్ షాపులకు అనుమతించడంతో మొదటి రెండు రోజులు ఎర్రటి ఎండలో కి.మీ పొడవునా క్యూ లైన్లు కట్టి మరీ మద్యం కొనుగోలు చేశారు. అయితే ఇప్పటికీ క్లోజింగ్ వేళల్లో కొన్ని వైన్ షాపుల వద్ద రద్దీ కనిపిస్తోంది. తాజాగా కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కర్ఫ్యూని రాత్రి 9గంటల నుంచి 5గంటల వరకే కుదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఆమె ఒక్కరి కోసం.. కేరళ సర్కార్ మానవతా దృక్పథానికి జనం ఫిదా..
ఇకపై వైన్ షాపులను రాత్రి 8గంటల వరకు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కంటైన్మెంట్ జోన్లు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఇది వర్తిస్తుంది. ఈ మేరకు అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇంతకుముందు ఉదయం 10గం. నుంచి సాయంత్రం 6గం. వరకు మాత్రమే వైన్ షాపులు తెరిచేందుకు అనుమతి ఉండేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వైన్ షాపులు మరో 2గంటలు అదనంగా నడవనున్నాయి.
కాగా,లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వాల ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 3.0లోనే వైన్ షాపులకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం క్రమంగా అన్ని రంగాల్లోనూ సడలింపులు ఇస్తూ,కర్ఫ్యూని కుదిస్తూ వస్తోంది. రాబోయే రోజుల్లో మరింత ఎకనమిక్ యాక్టివిటీకి సడలింపులనిచ్చే అవకాశం ఉంది.