కల్నల్ సంతోష్కు కాంస్య విగ్రహం,స్మారక స్థూపం.. ప్రకటించిన మంత్రి జగదీష్ రెడ్డి...
భారత్-చైనా సరిహద్దులో తలెత్తిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు తెలంగాణ ప్రభుత్వం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనుంది. అంత్యక్రియలు జరిగిన సూర్యాపేట కేసారంలోని సంతోష్ బాబు వ్యవసాయ క్షేత్రంలో స్మారక స్థూపంతో పాటు,పట్టణంలోని చౌరస్తాలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సంతోష్ అంత్యక్రియల అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి దీనిపై ప్రకటన చేశారు.
Recommended Video
సంతోష్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం తెలిపినట్టు చెప్పారు.సూర్యాపేటలో ఇవాళ(జూన్ 18)న జరిగిన సంతోష్ అంత్యక్రియల్లో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యానగర్లోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో పాల్గొని కడసారి వీడ్కోలు చెప్పేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. భౌతిక దూరం పాటిస్తూనే సంతోష్ బాబు అమర్ రహే.. వందే మాతరం నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
అంతిమయాత్ర సందర్భంగా ప్రజలు వారి ఇళ్ల పైనుంచి పూలు చల్లుతూ నివాళులు అర్పించారు.ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ సెంటర్, రైతు బజార్, పాత బస్టాండ్, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా 5కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసారం వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం సైనిక అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించారు.
మంత్రి జగదీశ్రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్, వివేక్ వెంకట స్వామి, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సంతోష్బాబు అంత్యక్రియలకు హాజరయ్యారు.