దీపావళి కానుకగా తెలంగాణా సర్కార్ బంపర్ ఆఫర్ ..ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దీపావళి సందర్భంగా తెలంగాణా ప్రజలకు , గ్రేటర్ హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన సంక్షోభం ఈ సమయంలో కూడా సంక్షేమం అందించామని పేర్కొన్నారు. 2020 -21 లో ఆస్తి పన్ను రాయితీ కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు . ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
జిహెచ్ఎంసీ తుది ఓటర్ల జాబితా విడుదల..వెబ్ సైట్ లో వివరాలు .. త్వరలో నోటిఫికేషన్
జిహెచ్ఎంసి పరిధిలో ఆస్తిపన్ను 15 వేల రూపాయల వరకు ఉంటే 50 శాతం రాయితీ
కరోనా నియంత్రణలో ప్రభుత్వం బాగా పని చేసిందని, రేషన్ కార్డు లేకున్నా కూడా ప్రజలకు బియ్యం అందించామని వెల్లడించిన కేటీఆర్ దీపావళి సందర్భంగా ప్రజలకు ఆస్తి పన్ను రాయితీలు కల్పించడంపై సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో ఆస్తిపన్ను 15 వేల రూపాయల వరకు ఉన్నా వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో పదివేల వరకు ఆస్తిపన్ను ఉన్నవారికి 50 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది సర్దుబాటు
15 వేల కంటే ఎక్కువ ఆస్తి పన్ను కట్టే వారికి ఈ రాయితీ వర్తించదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది సర్దుబాటు చేయనున్నట్లు తెలిపారు. ఒకవైపు కరోనా, మరోవైపు భారీ వర్షాలతో పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారీ ఊరట కలిగించడం కోసం సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్లో 13 లక్షల 72 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు మంత్రి కేటీఆర్.
ఆస్తి పన్ను రాయితీ ఇవ్వడంతో రాష్ట్రంపై 130 కోట్ల రూపాయల భారం.. అయినా సరే
ఆస్తి పన్ను రాయితీ ఇవ్వడంతో రాష్ట్రంపై 130 కోట్ల రూపాయల భారం పడిందని, అయినప్పటికీ ప్రజలపై భారం తగ్గించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇక వర్షాలు పడినప్పటికీ, వర్షాలు తగ్గక ముందే వరద సహాయం అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. నిజమైన వరద బాధితులు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. వరద సహాయం కోసం అదనంగా 70 కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు గా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇది సీఎం కేసీఆర్ తెలంగాణా ప్రజలకు ఇచ్చిన దీపావళి కానుక అని ఆయన పేర్కొన్నారు.