ఐటీ గ్రిడ్ తరహాలో సమాచార చోరీ ? కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు, కాంగ్రెస్ నేత సంచలనం
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీలో కాకరేపిన ఐటీ గ్రిడ్ తరహా మోసం తెలంగాణలో జరుగుతోందా ? సిటిజిన్ 360 పేరుతో పౌరుల వ్యక్తిగత సమాచారానికి భంగం కలుగుతోందా అంటే ఔననే అంటోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రోత్సాహంతోనే డేటా చోరీకి గురవుతుందని ఆరోపణలు చేసింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. కేంద్రం పట్టించుకోకుంటే హైకోర్టులో పిటిషన్ వేస్తామని హెచ్చరించింది. ఇంతకీ సిటిజన్ 360 అంటే ఏంటీ ? సమాచారం ఎలా చోరీకి గురవుతుంది ?
కుట్ర చేశారీలా ..
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వేదిక పేరుతో పౌరుల సమాచారాన్ని తెలియజేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనికి ఆధారాలు కూడా చూపింది. ఈ నెల 5న హైదరాబాద్లో జరిగిన ఐసీఏఐ సదస్సులో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చేసిన ప్రసంగం గురించి ప్రస్తావించింది. సిటిజన్ 360 పేరుతో సేకరించిన వివరాలను సమావేశంలో తెలియజేశారని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవన్ ఆరోపించారు. దీంతో పౌరులకు సంబంధించిన డేటాను సేకరించినట్టు ఓ ఐఏఎస్ అధికారుల బృందం కూడా అంగీకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డికి శ్రవణ్ కుమార్ బృందం వినతపత్రం అందజేశారు. చట్టవిరుద్ధంగా వ్యక్తుల వ్యక్తిగత గోప్యతా సమాచార సేకరించారని వివరించారు. ప్రజల అనుమతి లేకుండా వారి డేటా సేకరించడం ఏంటని ప్రశ్నించారు.
వెలుగులోకి వచ్చిందిలా
ప్రజల సమాచారాన్ని చట్టవిరుద్ధంగా ఎలా సేకరిస్తారని కొశ్చన్ చేశారు. ఒక ఏజెన్సీ ద్వారా వివరాలు సేకరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొన్నారు. డేటా చట్టం 2017, ఐటీ యాక్ట్ 2008లతోపాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రభుత్వ శాఖలతో లావాదేవీలు నిర్వహించే పౌరుల డేటాను సేకరించి తెలంగాణ ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించిందన్నారు. ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వ్యక్తిగత ఈ-మెయిల్స్, పాస్వర్డ్, డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం సేకరించిందని స్పష్టం అవుతోందన్నారు. పౌరుల సమాచారాన్ని రాజకీయ/ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వం వినియోగిస్తోందని ఆరోపించారు. సమాచారం పేరుతో ప్రజలకు తెలియకుండానే వాళ్ల వేలి ముద్రల డేటాను కూడా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వం సేకరించిందని మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపించాలని కిషన్ రెడ్డిని కోరారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని విన్నవించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు
వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉండాలని, నిబంధనలను ఉల్లంఘించొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమని ఫిర్యాదులో శ్రవణ్ పేర్కొన్నారు. ఆధార్ చట్టానికి సంబంధించి 2018 సెప్టెంబర్లో శ్రవణ్ ఇచ్చిన తీర్పుకు పూర్తి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యక్తుల వ్యక్తిగత డేటాను సేకరించిందన్నారు. పౌరుల సమాచారాన్ని గుట్టుగా సేకరించి దానిని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. ఇది పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని, రాజ్యాంగం 14, 21 ఆర్టికల్ కింద పౌరుల హక్కులకు కల్పించిన హక్కులను ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘించిందన్నారు.
అంతేకాదు వారి అనుమతి లేకుండా రాష్ట్రంలోని పౌరులందరికీ ఆధార్కు సమాంతరంగా కార్డులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డేటాకు రక్షణ, భద్రతా చర్యలను ప్రభుత్వం ఏం తీసుకుంటుందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా సేకరణ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం తీవ్రమైన విషయమని, ఆ ప్రైవేట్ సంస్థ ద్వారా వ్యక్తుల వ్యక్తిగత, గోప్యతా సమాచారం ఇతరులకు చేరదని గ్యారెంటీ ఏందని ప్రశ్నించారు.
ఐటీ యాక్ట్కు తూట్లు ..
టీఆర్ఎస్ సహా ఇతరుల స్వార్థ ప్రయోజనాలకు ఆ డేటా చేరుతుందనే అనుమానం వ్యక్తం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000, ఐటీ యాక్ట్-2000లోని సెక్షన్ 72ఎలను తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘించిందని శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంపై టెలిఫోన్ ట్యాప్పింగ్ లాంటి గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అనేక మంది పౌరుల ప్రైవేట్ డేటాలోకి చొచ్చుకుపోతోంది. పౌరుల సున్నిత, రహస్య డేటాకు ముప్పు ఏర్పడిందన్నారు. మొత్తం పౌరుల డేటా రాజకీయ ప్రయోజనాల కోసం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని శ్రవణ్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే హైకోర్ట్ ను ఆశ్రయిస్తామని చెప్పారు శ్రవణ్.