తెలంగాణ ఉద్యోగులకు మరోసారి నిరాశ.. పీఆర్సీ వాయిదా.. ఎప్పటివరకంటే..
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ(వేతన సవరణ కమిషన్) విషయంలో మరోసారి నిరాశ తప్పలేదు. పీఆర్సీ గడువును ప్రభుత్వం డిసెంబర్ 31వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలవుతుందని ఆశించిన ఉద్యోగులకు భంగపాటు ఎదురైంది. ఈ నెల 24 లోపు నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. కమిషన్ నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతోనే గడువును డిసెంబర్ వరకు పొడిగించినట్టు సమాచారం.
పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతున్నందునా.. మధ్యంతర భృతినైనా అమలుచేయాలని ఇటీవల ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశాయి. దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. ఇంతలోనే పీఆర్సీ వాయిదా పడటం వారిని మరింత నిరాశకు గురిచేసేలా మారింది. అయితే టెక్నికల్ అంశాలతోనే పీఆర్సీ గడువును పెంచారని, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్టు తెలుస్తోంది.
Recommended Video
కాగా,పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు.2018 ఆగస్టులోనే వేతనాలు పెంచుతామని సీఎం ప్రకటించినా అమలు కాలేదు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో ఎప్పుడూ భేటీ కాలేదు. హుజూర్నగర్ ఉప ఎన్నికల సమయంలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సందర్భంలో ఉద్యోగ జేఏసీ నేతలను పిలిచి భోజనం పెట్టిన సీఎం.. ఎన్నికలు కాగానే భేటీ ఉంటుందన్న సంకేతాలిచ్చారు.
అయితే ఆ తర్వాత ఎటువంటి భేటీ జరగలేదు. నవంబర్లో నెలలో ఉద్యోగుల్లో మళ్లీ పీఆర్సీపై ఆశలు చిగురించాయి. ప్రభుత్వం 10,12 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పీఆర్సీని ఆదేశించడంతో త్వరలోనే అమలు జరుగుతుందని ఆశించారు. ఇక ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం,రాష్ట్రానికి నిధులు తగ్గిన నేపథ్యంలో ఎంతో కొంత వేతన సవరణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైనా పీఆర్సీ నివేదిక ఆలస్యమవుతుండటంతో గడువును పెంచక తప్పలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.