తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం .. ఏపీ,మహారాష్ట్రలకు వెళ్ళకుండా నిషేధం
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఏపీతో పోల్చి చూస్తే తక్కువ నమోదు అయ్యాయి. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్పలితాలను ఇస్తున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణా రాష్ట్రంలో 1,038 కేసులు నమోదు కాగా , ఈ కేసుల్లో 568 యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 442 కేసులు రికవర్ కాగా ఇప్పటి వరకు 28 మంది మృతి చెందారు. ఇక కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలోరాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రబలకుండా ఉండటానికి సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు .
రైతన్నలకు శాపంగా అకాల వర్షాలు .. తడిసినా సరే ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని రైతుల నిరసనలు
కరోనా పాజిటివ్ కేసుల్లో టాప్ 1లో మహారాష్ట్ర
తెలంగాణా రాష్ట్ర ప్రజలెవరూ ఆంధ్రప్రదేశ్కు, మహారాష్ట్రకు వెళ్లకుండా నిషేధం విధించింది తెలంగాణా సర్కార్. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా పంజా విసురుతుంది. ఏ మాత్రం కరోనా కంట్రోల్ లోకి రావటం లేదు. దేశంలోనే కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. ఇప్పటికి మహారాష్ట్రలో 10,498 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈ కేసుల్లో యాక్టివ్ గా 8,266 కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 1,773 మంది కోలుకోగా 459 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో ముఖ్యంగా ముంబై నుండే 7,061 కేసులు నమోదు కావటం అక్కడ కరోనా తీవ్రతకు అద్దం పడుతుంది.
తెలంగాణా కంటే ఎక్కువ కేసులతో ఏపీ
ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వస్తే తెలంగాణా కంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు 1,403 కేసులు నమోదు కాగా 1,051 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 321 మంది కోలుకోగా 31 మంది మృతి చెందారు. ఇక తెలంగాణా సరిహద్దు జిల్లాలైన కర్నూలు లో 386 కేసులు , గుంటూరు లో 287, ఇక కృష్ణా జిల్లాలో 246 కేసులు నమోదు అయ్యాయి . దీంతో ఈ జిల్లాలు తెలంగాణా సరిహద్దు జిల్లాలు కావటంతో ఎవరూ అటు వెళ్ళకుండా తెలంగాణా సర్కార్ నిషేధం విధించింది .
తెలంగాణా రాష్ట్ర ప్రజలెవరూ ఆంధ్రప్రదేశ్కు, మహారాష్ట్రకు వెళ్లకుండా నిషేధం
తెలంగాణా రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ , మహారాష్ట్ర రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ ఆ జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్లొద్దు అని ఆదేశాలు జారీ చేసింది . మెడికల్ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ పనులకు కూడా ఏపీ, మహారాష్ట్రల్లోకి వెళ్లడానికి వీలు లేదని సరిహద్దుల్లోని ప్రాంతాల ప్రజలను ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని అమలు చెయ్యడానికి పోలీసు బలగాలను సైతం పెంచిన తెలంగాణా సర్కార్ కరోనా కట్టడి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
సరిహద్దుల్లో భద్రత కట్టు దిట్టం ... సరిహద్దు జిల్లాల ప్రజలకు ఆదేశాలు
ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన తెలంగాణా ప్రభుత్వం బోర్డర్ లో ఉన్న జిల్లాలకు వెళ్లి ఆరోగ్యానికి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తుంది . కర్నూలులో కరోనా కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో పక్కనే ఉన్న తెలంగాణలోని గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల ప్రజలు అక్కడికి వెళ్లకుండా రాకపోకలను నిషేధించింది తెలంగాణా సర్కార్ . అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లాల వాళ్లు కూడా విజయవాడ, గుంటూరు వైపు వెళ్లడానికి వీలు లేకుండా సర్కార్ భద్రతను మరింత పెంచింది. దీంతో పక్క రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ జరిగే వరకు పక్క రాష్ట్రాలతో సంబంధం లేనట్టే అని తాజా నిర్ణయం ద్వారా తెలియజేసింది తెలంగాణా సర్కార్ .