గణేష్ ఉత్సవాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం...
ప్రతీ ఏటా వినాయక చవితి వచ్చిందంటే గల్లీకో రెండు,మూడు వినాయకులు,డీజే సౌండ్స్,ఊరేగింపులు... ఆ సందడే వేరేలా ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా నేపథ్యంలో ఈసారి ప్రజలంతా ఇంట్లోనే గణేషుడిని ఏర్పాటు చేసుకుని నిరాడంబరంగా పూజలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఈసారి వినాయక మండపాలు,సామూహిక నిమజ్జనాలకు అనుమతి ఇవ్వబోమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని కోరారు.
గణేష్ ఉత్సవాల నిర్వాహకులు కరోనా పరిస్థితులను అర్థం చేసుకుని బహిరంగ వేడుకలకు దూరంగా ఉండాలని సూచించారు. నవరాత్రుల్లో ఇండ్ల వద్దే సంప్రాదయబద్దంగా పూజలు చేసుకోవాలని చెప్పారు. గణేశ్ చతుర్ధి వేడుకలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లతో పాటు జీహెచ్ఎంసి కమిషనర్, భాగ్యనగర్ గణేష్ఉత్సవ సమితి నాయకులు హాజరయ్యారు.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఖైరతాబాద్ విగ్రహ ఎత్తును కూడా 9 అడుగులకు కుదించారు.
హైదరాబాద్లోనే కాదు పలు జిల్లాల్లోనూ గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వట్లేదు. మూడు రోజుల క్రితం కొడంగల్ సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రామాల్లో బహిరంగ వేడుకలకు అనుమతి లేదన్నారు. మండపాల కారణంగా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉండటంతో... ఇండ్లలోనే విగ్రహాలు ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు.