మద్యం ప్రియులకు తీపికబురు: లిక్కర్ షాపుల పని వేళలపై ఆంక్షల ఎత్తివేత
హైదరాబాద్: తెలంగాణలో మద్యం ప్రియులకు మరో తీపి కబురు అందింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పనివేళలపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. ఆంక్షలను ఎత్తివేస్తూ సోమవారం అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో మాత్రం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతించింది.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా మార్చి నెల చివరి వారంలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. సుమారు మూడు నెలలపాటు ఈ లాక్డౌన్ కొనసాగగా.. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడం కోసం లాక్డౌన్ నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలించుకుంటూ వస్తున్నాయి.
ఈ క్రమంలోనేనే మద్యం షాపులు తెరుచుకున్నాయి. మొదట పనివేళలపై ఆంక్షల విధించగా.. ఇప్పుడు పూర్తిగా ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో మద్యం ద్వారా వచ్చే ఆదాయం మరింతగా పెరగనుంది. అయితే, మద్యం షాపుల పనివేళలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓ వైపు కరోనాతో జనాల ప్రాణాలు పోతుంటే.. ప్రభుత్వం మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి పెట్టిందని మండిపడుతున్నాయి.
కాగా, తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 67,660 మంది కరోనా బారినపడ్డారు. 18,500 యాక్టివ్ కేసులున్నాయి. 48,609 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 551 మంది కరోనాతో మరణించారు.