బీసీ రిజర్వేషన్లు పదిలం.. 34 శాతానికి సై.. కోర్టుల్లో ప్రభుత్వం గట్టేక్కేనా?
హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం పట్టు బిగిస్తోందా? అటు కోర్టు తీర్పులను సైతం ధిక్కరించేలా పావులు కదుపుతోందా? ఏదిఏమైనా పంచాయతీల్లో పాగా వేయడమే లక్ష్యంగా ముందుకెళుతోందా? ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వం శనివారం తీసుకున్న కీలక నిర్ణయం అవుననే సమాధానం ఇస్తోంది. బీసీల రిజర్వేషన్లు 34 శాతాన్ని పదిలం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.
బీసీ రిజర్వేషన్లపై స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు బీసీలకు అమలవుతున్న 34 శాతాన్ని ఫిక్స్ చేసేసింది స్టేట్ సర్కార్. అయితే బీసీలకు 34 శాతం అమలు చేస్తే మొత్తం రిజర్వేషన్లు దాదాపు 60 శాతానికి పెరుగుతాయి. అటు సుప్రీంకోర్టు 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దని ఆదేశించింది. ఈనేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా ఆర్డినెన్స్ ను తెరపైకి తేవడంతో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆఘమేఘాల మీద ఆర్డినెన్స్
పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం అమలు చేసేందుకు శనివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆఘమేఘాలమీద ఆర్డినెన్స్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రిజర్వేషన్లు మొత్తమ్మీద 50 శాతానికి మించొద్దనే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ చకచకా పావులు కదిపారు. సర్వోన్నత న్యాయస్థానం పరిమితిని అధిగమించేలా కొత్త స్కెచ్ వేశారు. ఆర్డినెన్స్ తేవడం లేదంటే సభలో బిల్లు పెట్టి చట్టం తీసుకురావడం.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ప్రత్యామ్నాయంగా ఆలోచించారు. చివరకు ఆర్డినెన్స్ తేవడానికే మొగ్గు చూపారు.
సాయంత్రం నిర్ణయం.. రాత్రికి గవర్నర్ సంతకం
ఆర్డినెన్స్ జారీచేయాల్సిన పక్షంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. అటు అసెంబ్లీ గానీ, ఇటు శాసన మండలి గానీ.. ఉభయసభల్లో సమావేశాలు ఉండకూడదు. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఇంకా అసెంబ్లీ సమావేశాలకు సన్నాహాలు మొదలు కాలేదు కాబట్టి దాని విషయంలో ప్రాబ్లమ్ లేదు. ఇక మిగిలింది శాసనమండలి. శనివారం మధ్యాహ్నం వరకు కూడా మండలిని నిలిపివేయాలని ( ప్రొరోగ్ ) ప్రభుత్వం భావించలేదు. అలాంటిది సాయంత్రం వరకు సీన్ రివర్సయింది. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని శాసనమండలిని నిలిపివేస్తూ ( ప్రొరోగ్ ) ఉత్తర్వులు జారీ అయ్యాయి. దానివెంబడే ప్రతిపాదిత ఆర్డినెన్స్ ఫైలుపై సీఎం కేసీఆర్, హోం మినిస్టర్ మహమూద్ అలీ సంతకాలు చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. ఆయన కూడా ఆర్డినెన్స్ కు ఓకే చెబుతూ శనివారం రాత్రి సంతకం చేయడంతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఆర్డినెన్స్ తో పంచాయతీ ఎన్నికల్లో సుప్రీంకోర్టు చెప్పిన 50 శాతానికి మించి దాదాపు 60 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి.
34 కే మొగ్గు.. 23 ఐతే నష్టమా?
కొత్త జిల్లాల ఏర్పాటుతో 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. ఆరు నెలల కిందటి ప్రతిపాదనల ప్రకారం 60.19 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. తాజాగా ఓటరు గణన ప్రకారమైతే ఇవి దాదాపు 61 శాతానికి చేరే అవకాశం కనిపిస్తోంది. అంటే సుప్రీంకోర్టు పరిమితిని మించి ఈ ప్రతిపాదనలు 10 శాతానికి పైగా అదనంగా ఉన్నాయి. జనాభా దమాషా పద్దతిలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తారు. ఆ క్రమంలో సుప్రీంకోర్టు ట్యాప్ (50శాతం) పరిగణనలోకి తీసుకుంటే బీసీ రిజర్వేషన్లు 23 శాతానికి తగ్గించాల్సి వస్తుంది.
2013 నాటి ఎన్నికల్లో 34 శాతం అమలు చేసిన బీసీ రిజర్వేషన్లను అదే మాదిరిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడయింది. అందుకే సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే 6 నెలల కిందట ఓటరు జాబితా పరిశీలనలో బీసీలు దాదాపు 54 శాతం ఉన్నట్లుగా తేల్చారు. తాజా పరిశీలనలో కూడా అటుఇటుగా ఇదే పర్సంటేజీ తేలే అవకాశం కనిపిస్తోంది. 54 శాతం ఓటు బ్యాంకున్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే తీవ్రంగా నష్టపోతామని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అదే సుప్రీం ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటే బీసీ రిజర్వేషన్లు 23 శాతానికి కుదించాల్సి వస్తుంది.. అందుకే ఏదిఏమైనా ఆర్డినెన్స్ కే మొగ్గు చూపింది ప్రభుత్వం.
పంచాయతీ కిరికిరేనా? ఎన్నికలు జరిగేనా?
బీసీల రిజర్వేషన్లు తగ్గకుండా 34 శాతానికి పదిలం చేసిన కేసీఆర్ అసలు వ్యూహమేంటి అనేది చర్చానీయాంశంగా మారింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అంటూ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగాలనుకుంటున్న కేసీఆర్.. సరికొత్త స్ట్రాటజీకి తెర తీశారనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బీసీలు అధికంగా ఉన్న నేపథ్యంలో వారికి దగ్గరయ్యేందుకు ఇదో ఎత్తుగడ అనేది మరో కోణం. ఇక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించి సక్సెసయితే.. అది క్రెడిబిలిటీగా మారుతుందనేది ఆయన అంతరంగంగా కనిపిస్తోంది. అయితే ఆర్డినెన్స్ తో 34 శాతం బీసీ రిజర్వేషన్ల మంత్రాంగం నడుపుతున్నా.. కోర్టుల్లో ఇది నిలబడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అననుకూల పరిస్థితులు దాటుకుని తుది ఘట్టానికి చేరుకున్న పంచాయతీ ఎన్నికలు చివరకు జరుగుతాయో లేదోననే అనుమానాలు షికారు చేస్తున్నాయి.