తెలంగాణలో కరోనా ఆసుపత్రి.. గాంధీ నుంచి మరోచోటకు.. ఎక్కడా..?
తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసుగా నమోదైన పేషెంట్కు సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తోన్న సంగతి తెలిసిందే. మరో 40 మంది కరోనా అనుమానిత పేషెంట్లను కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతుండటంతో గాంధీలో ఐసోలేషన్ వార్డు సరిపోయేలా లేదు.
దానికి తోడు నగరం నడిబొడ్డున ఉన్న ఆసుపత్రిలో.. తెలంగాణవ్యాప్తంగా నిత్యం వేలాదిమంది వచ్చే ఆసుపత్రిలో.. కరోనా పేషెంట్లకు చికిత్స చేయడంపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తే మిగతా పేషెంట్లు,చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో కాకుండా కరోనా పేషెంట్లకు ప్రత్యేకంగా మరోచోట చికిత్స అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రి,ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రులను కూడా పరిశీలించారు. అయితే అవి కూడా నగరానికి మధ్యలోనే ఉండటంతో అక్కడ ఏర్పాటు చేయడం సరికాదని భావిస్తున్నారు. వికారాబాద్లోని అనంతగిరిలో కరోనా ఆసుపత్రి ఏర్పాటును ప్రభుత్వం పరిశీలిస్తోంది. నేడు లేదా రేపు దీనిపై నిర్ణయం తీసుకుని చకచకా పనులు మొదలుపెట్టనుంది.
అనంతగిరిలో కరోనా ఆసుపత్రి ఏర్పాటు చేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కేసు నమోదైనా అక్కడికే తరలించి చికిత్స అందిస్తారు.ప్రస్తుతం బెడ్ల కొరత కారణంగా గాంధీ ఆసుపత్రిలోని పెయిడ్ రూమ్స్ను కూడా ఐసోలేషన్కి వినియోగిస్తున్నారు. కరోనా లక్షణాలు అంతగా కనిపించనివారిని తమ ఇళ్లల్లోనే ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్రమంత్రి హర్షవర్దన్ తెలిపారు. ఇందులో ముగ్గురు కోలుకున్నారని.. దాంతో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 25గా ఉందని చెప్పారు. ఇటీవల ఇటలీ నుంచి ఆగ్రా వెళ్లిన ఓ వ్యక్తి కారణంగా అతని కుటుంబ సభ్యుల్లో ఆరుగురితో పాటు ఆగ్రాలోనూ వైరస్ వ్యాపించిందని చెప్పారు. అయితే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని.. అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని వెల్లడించారు.