తెలంగాణలో మాత్రమే: ఆన్లైన్ అమ్మకాలపై పన్ను విధించే ఆలోచనలో సర్కార్
హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సంస్ధలకు, ఐటీ కంపెనీలకు స్నేహపూర్వక వాతావరణం ఉందన్న తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి నెలకొంది. అందుకు కారణం ఆన్లైన్ దిగ్గజాలైన ఈ కామర్స్ సంస్థలపై కేసీఆర్ ప్రభుత్వం పన్ను విధించాలని అనుకోవడమే.
ఇదే గనుక జరిగితే తెలంగాణ రాష్ట్రంలో భారీ గిడ్డంగులను ఏర్పాటు చేసుకున్న ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి సంస్థలకు భారీ నష్టమే. ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న ఈ వివాదాస్పద పన్నుపై రాష్ట్రా వాణిజ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
"అన్ని రకాల ఆన్ లైన్ లావాదేవీలను పరిశీలించేందుకు తగిన విధానాన్ని రూపొందించాలని చూస్తున్నాం. కామన్ సర్వర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది. పన్ను పరిధి నుంచి ఎవరూ తప్పించుకోకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం" అని ఆయన అన్నారు.
ప్రస్తుత పన్ను వసూలు విధానంలో 'లూప్ హోల్స్' ఉన్నాయని, వాటిని అడ్డం పెట్టుకొని కొంత మంది డబ్బు సంపాదిస్తున్నారని తలసాని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎంతో మంది ట్రేడర్లు, పెద్ద పెద్ద కంపెనీలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా వ్యాపారాన్ని చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు.
"టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం, అయితే, ఈ విధానంలో కూడా నియంత్రణ తప్పనిసరి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి రాకూడదు. మరో వారంలో కొత్త విధానాన్ని ప్రతిపాదిస్తాం" అని ఆయన అన్నారు.
ఇప్పటికే ఈ కామర్స్ సంస్థలపై కర్ణాటక, కేరళ, మహారాష్ట్రల్లో అమలవుతున్న విధానాన్ని ఇక్కడ కూడా పాటించాలన్నది ప్రభుత్వ ఆలోచన. తయారీ దారుల నుంచి వినియోగదారులకు మార్కెట్ రేటుతో పోలిస్తే తగ్గింపు ధరలకు పలు ఉత్పత్తులను అందిస్తోన్న ఈ కామర్స్ సంస్థలపై ఒక శాతం పన్నును విధించాయి.
ఈ పన్ను భారాన్ని తట్టుకోలేకనే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఈ కామర్స్ సంస్థలు తెలంగాణలో గిడ్డంగులు ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా పన్ను విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
"కొత్త పన్నుల విషయమై కమర్షియల్ టాక్స్ విభాగం నుంచి వచ్చే నివేదిక కోసం వేచి చూస్తున్నాం. ఆ తరువాతే ఈ-కామర్స్ ఇండస్ట్రీని కూడా పన్నుల పరిధిలోకి తీసుకువస్తాం. ఆ విధివిధానాలకు త్వరలో రూపకల్పన జరుగుతుంది" అని ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వ్యాఖ్యానించారు.
అయితే, కంపెనీలను సంప్రదించిన తర్వాతనే తుది నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కామర్స్ సంస్థలపై ఒక శాతం పన్ను విధించడం ప్రారంభిస్తే, తెలంగాణలో ఎక్కువ ధర పెట్టి ఆన్లైన్లో ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.