తగ్గిన ఎల్ఆర్ఎస్ భారం... జీవోను సవరించిన ప్రభుత్వం... కొత్త ఛార్జీలు ఇలా...
అక్రమ లేఅవుట్లు,ప్లాట్ల క్రమబద్దీకరణకు ఆఖరి ఛాన్స్ అంటూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎల్ఆర్ఎస్ స్కీమ్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎల్ఆర్ఎస్ ఛార్జీలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో.131 పేదలు,మధ్య తరగతి వర్గాలపై పెనుభారాన్ని మోపిందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. దీంతో జీవో.131ని పున:సమీక్షించిన ప్రభుత్వం తాజాగా దానికి సవరణలు చేసి ఉత్తర్వులు జారీ చేసింది.
సవరించిన జీవో.131 ప్రకారం... ప్లాట్ లేదా లేఅవుట్ రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగా ఎల్ఆర్ఎస్ ఛార్జీలు వసూలు చేస్తారు. దీని ద్వారా సుమారు 50శాతం మేర భారం తగ్గనుంది. మంత్రి కేటీఆర్ బుధవారం(సెప్టెంబర్ 16) అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే... ఎల్ఆర్ఎస్ కోసం 2015లో జారీ చేసిన జీవోనే ఈసారి యథాతథంగా అమలులోకి తీసుకొచ్చారు. తాజా జీవో ప్రకారం చదరపు గజానికి రూ.3వేలు మార్కెట్ విలువ ఉంటే 20శాతం ఎల్ఆర్ఎస్ చార్జీగా వసూలు చేస్తారు.
3001 నుంచి 5000 చదరపు గజాల వరకూ 30శాతం,5001 నుంచి 10000 వరకూ 40శాతం,10.,001 నుంచి 20000 వరకూ 50శాతం,20001 నుంచి 30000 వరకూ 60శాతం,30001 నుంచి 50000 వరకూ 80శాతం ఫీజును ఎల్ఆర్ఎస్ రుసుంగా వసూలు చేస్తారు.
Recommended Video
ఎల్ఆర్ఎస్ ఛార్జీల తగ్గింపుపై మంత్రి కేటీఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఎల్ఆర్ఎస్పై ఒకవేళ ప్రభుత్వం పొరపాటుగా నిర్ణయం తీసుకుని ఉంటే, దాన్ని సవరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడారు. పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్థిక భారం పడకుండా రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగానే భూముల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) చేసే విధంగా జీవోను సవరించనున్నట్టు ప్రకటించారు. చెప్పినట్లుగానే నేడు ఉత్తర్వులు రావడంతో చాలామందికి ఊరట కలిగినట్లయింది.