ఆ ఒక్కటీ అడగొద్దు: క్యాబినెట్లో చోటు లేని తెలంగాణ, కవితే కారణమా?
హైదరాబాద్: ఆకాశంలో సగం మహిళ. సమాజ మార్పుల్లో మహిళకు భాగం ఉన్నది. తెలంగాణ సబ్బండ వర్ణాల ఆకాంక్షలే ప్రధానంగా ఆవిర్భవించి మూడేళ్లు దాటింది. కానీ తెలంగాణ ఆవిర్భావం నాడే సగభాగమైన మహిళలకు చోటు కల్పించడంలో అన్యాయం జరిగింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో కాకలు దీరిన మహిళానేతలకు కొదవ లేదు.
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మొదలు నాలుగు ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత వంటి వారు ఉన్నారు. కానీ సమీకరణాల్లో మార్పుల వల్ల ఆ పని చేయలేకపోతున్నామని నాటి నుంచి అధికార పక్షం టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం వాదిస్తోంది. తెలంగాణలో ఏర్పాటైన తొలి క్యాబినెట్లో మహిళకు చోటు కల్పించకపోవడం రాజకీయంగా, వ్యూహాత్మకంగా సరి కాదని విశ్లేషకులు చెప్తున్నారు.
కానీ తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో 'తెలంగాణ జాగ్రుతి' వ్యవస్థాపక అధ్యక్షురాలు, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కే చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ప్రాధాన్యం తగ్గుతుందన్న బాధతోనే.. భయంతోనే క్యాబినెట్లో మహిళకు చోటు కల్పించ లేదని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మహిళా నేతలు విమర్శలు గుప్పించారు.
సాక్షాత్తు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా అనివార్య కారణాల రీత్యానే సీఎం కేసీఆర్ మహిళకు తన క్యాబినెట్లో చోటు కల్పించలేకపోతున్నారని పదేపదే వివరణ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటై అలవోకగా మూడేళ్ల సమయం పూర్తయింది. మహిళా నాయకురాళ్లకు క్యాబినెట్లో చోటు కల్పించలేకపోవడానికి కారణాలేమిటో టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ఈనాటికీ సబ్బండ తెలంగాణ ప్రజల ముందు చెప్పకపోవడానికి కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు.
సురేఖ మంత్రి పదవి డిమాండ్కు నో?
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్షంగా నామినేటెడ్ పోస్టుల పందేరం తెలంగాణలో సాగుతున్నది. అందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలితో పాటు మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్పర్సన్గా సుధారాణిని కేసీఆర్ నియమించారు. అయితే రెండు పదవులు ఎందుకివ్వాలన్న చర్చ ప్రస్తుతం పార్టీలో జరుగుతోంది. గతంలో ఈ రెండు పోస్టులు చేయాలని కేసీఆర్ కొండా సురేఖను అడిగితే ఆమె చేయనని చెప్పడంతో పాటు మంత్రి పదవి కావాలని కోరడంతో ఆ పోస్టును సురేఖ సామాజిక వర్గానికే చెందిన గుండు సుధారాణికి ఇచ్చి వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకవర్గం వారిని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు మరోవైపు ఉద్యమకారులను సంతృప్తి పరిచే దిశగా గులాబీ దళపతి దృష్టి సారిస్తున్నారు.
ఓరుగల్లుపై సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇలా..
ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారంలో అధినేత అంతరంగం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఊహించని వ్యక్తులకు ఎవరూ ఊహించని పదవులు వస్తున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్నవారికి అసలు దిక్కే లేకుండా పోతోంది. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన నామినేటెడ్ పదవులు ఉమ్మడి వరంగల్ లో కొత్త చిచ్చుకు కారణమయ్యాయి. ఇప్పటికే అత్యధికంగా నామినేటెడ్ పొందిన జిల్లాగా పేరొందిన చోట మళ్లీ కొత్త పదవుల పంపిణీలో ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన ఓరుగల్లు తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హైదరాబాద్ తర్వాత వరంగల్కే అంత ప్రాధాన్యమిస్తున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించడమే కాకుండా ఉమ్మడి జిల్లాలో ఉద్యమకారులతో పాటు తనతోపాటు ముందునుండీ కొనసాగిన వారికి, కొత్తగా చేరిన వారికి .. ఇలా ఏ ఒక్కరికీ ప్రాధాన్యత తగ్గించకుండా అందరినీ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆశలు సజీవంగా కొనసాగించిన వైనం
తెలంగాణ ఏర్పాటైన తర్వాత నామినేటెడ్ పోస్టులకు భలే గిరాకీ పెరిగింది. మొదట్లో ప్రతీ ఒక్కరూ తమకు నామినేటెడ్ దక్కుతుందని భావించినా.. నిన్నమొన్నటివరకూ ఆ దిశగా కేసీఆర్ అడుగులు వేయలేదు. ఎప్పుడో అరకొర నింపినా.. అవి కూడా ప్రాధాన్యత కలిగిన, ఆ క్షణంలో అవసరమైన వాటినే ఎంచుకున్నారు తప్ప అందరి ఆశలను ఆశలుగానే ఉంచారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఊపందుకున్నది. సగ భాగంగా ఉన్న మహిళల ఓటర్లను వచ్చే ఎన్నికల్లో కొల్లగొట్టే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు గులాబీ పార్టీ అధినేత. ముఖ్యంగా ఛైర్పర్సన్ల ఎంపిక విషయంలో చాలా స్పీడ్గా కేసీఆర్ వెళుతున్నారనేది పార్టీ వర్గాల్లో ఉన్న టాక్. ఇప్పటికే వరంగల్ కు చాలా వరకు రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చిన కేసీఆర్ ఇక ఇతర జిల్లాలపై దృష్టి పెడతారని అందరనుకోగా.. నాలుగురోజుల క్రితం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో మళ్లీ వరంగల్నే సెంటర్ పాయింట్గా చేయడం అందరినీ ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది.
సరైన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్న కేసీఆర్
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఇప్పటివరకు వరంగల్కు వచ్చిన రాష్ట్ర స్థాయి పదవుల్లో పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా పేర్వారం రాములు, రాష్ట్ర సివిల్ సప్లయిస్ ఛైర్మన్గా పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆగ్రోస్ ఛైర్మన్గా కిషన్ రావు, గొర్రెల అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా రాజయ్య యాదవ్, హ్యాండీక్రాఫ్ట్స్ ఛైర్మన్గా బొల్లం సంపత్, ఖాదీ బోర్డు ఛైర్మన్గా మౌలానా, .. ఇవే కాక డైరెక్టర్లుగా మరికొందరిని నియమించారు. వీరి నియామకాల్లో సీఎం కేసీఆర్ సమీకరణాలు ఎలా ఉన్నా.. ఇటీవల నింపిన పోస్టుల విషయంలో మాత్రం రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. సోమవారం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన వాసుదేవరెడ్డి, గుండు సుధారాణి, గాంధీనాయక్ ఉన్నారు. వీరిలో వాసుదేవరెడ్డి విద్యార్థి ఉద్యమ నేతగా కేయూ నుంచి పోరాటం సాగించారు. తెరాస విద్యార్థి విభాగం నేతగా కొనసాగుతూనే.. కేసీఆరే తనకు న్యాయం చేస్తారన్న ధీమాతో ముందుకుసాగారు.
మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్పై శీతకన్ను?
అనుకున్నట్లే వికలాంగుల అభివృద్ధిసంస్థ చైర్మన్గా వాసుదేవరెడ్డిని ప్రకటించిన కేసీఆర్ మరో అడుగు ముందుకేసి తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం వచ్చేవరకు అరగుండు, మీసంతో ఉంటానని చెప్పి అలాగే ఉంటూ కేసీఆర్కు వీర విధేయుడుగా ఉన్న మానుకోటకు చెందిన గాంధీనాయక్ కు గిరిజన సహకార సంస్థ ఛైర్మన్గా అవకాశమిచ్చారు. దీంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఇద్దరిని గుర్తించినట్లయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. గాంధీనాయక్ ఉద్యమకారుడు కాగా.. అదే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ విషయంలో కేసీఆర్ ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందే తన రాజకీయభవిష్యత్ను ఫణంగా పెట్టి వచ్చిన సత్యవతికి ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదని ఆమె సన్నిహితుల్లో ఆవేదన నెలకొంది.
హామీ నిలుపుకున్న సీఎం కేసీఆర్
ప్రధానంగా గుండు సుధారాణి నియామకం విషయంలో పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గుండు సుధారాణి వరంగల్ నగరంలో గతంలో టీడీపీ నుంచి కార్పొరేటర్గా ఎన్నికై ఆ తర్వాత రాజ్యసభ ఎంపిగా చంద్రబాబు అత్యున్నత అవకాశమివ్వడంతో పదవిలో కొనసాగారు. అయితే పదవి ముగియడానికి ఆరు నెలల ముందు ప్రధానంగా వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల ముందు సుధారాణి టీఆర్ఎస్లో చేరడం, ఆ తర్వాత నగర పాలక సంస్థ ఎన్నికల్లో చాలా చురుగ్గా పనిచేయడంతో కేసీఆర్ కొంత సానుకూలంగా ఉన్నారు. ఆమె పార్టీలో చేరే సమయంలోనే ఎమ్మెల్సీగానీ, ఏదైనా నామినేటెడ్ ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకున్నారు.
మంత్రుల సహకారంతో ఇలా సుధారాణి
గుండు సుధారాణికి ఈ పదవులు రావడం వెనక టీఆర్ఎస్ సీనియర్ నేత సముద్రాల వేణుగోపాలాచారి ప్రమేయంతో పాటు పార్టీలో మరో మంత్రి సహకరించినట్లు సమాచారం. టీడీపీలో ఉండగా కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావులతోపాటు సాన్నిహిత్యంగా ఉన్న సుధారాణి ఇప్పుడు టీఆర్ఎస్ అధినాయకత్వంతో సంబంధాలు కొనసాగిస్తున్నారని సమాచారం. మరోవైపు సుధారాణిపై ఆమె నియోజకవర్గంలోని కొందరు కేసీఆర్ వద్దకు వెళ్లి ఆమె ఆర్థిక స్థితిగతులపై ఫిర్యాదు చేశారని తెలిసింది. దీంతో ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో సుధారాణికి మహిళా అధ్యక్షురాలితో పాటు ఫెడరేషన్ ఛైర్పర్సన్ పదవి కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్న మేరకే ఆమెకు ఆ పదవి ఇచ్చారని వినికిడి.
అధికార యంత్రాంగంపై నామినేటెడ్ బెదిరింపులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చిచ్చు రేపుతోంది. ప్రధానంగా ఛైర్పర్సన్ల నియామకంతో స్థానిక ఎమ్మెల్యేల ప్రాధాన్యం తగ్గుతున్నట్లుగా చర్చ జరుగుతోంది. వరంగల్ తూర్పులో ఇన్నాళ్లూ పైకి కలిసే ఉన్నట్లు కనిపించినా.. అంతర్గతంగా మాత్రం ఉప్పునిప్పులా ఉన్న కొండాసురేఖ, గుండుసుధారాణిలలో ఎవరి గ్రూపులో ఉండాలో తేల్చుకోలేని స్థితిలో నగర కార్పొరేటర్లతోపాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. ఛైర్పర్సన్ల నియామకం తర్వాత వారే స్థానిక ఎమ్మెల్యేల కంటే ఓ స్టెప్ పైనే ఉంటున్నారని కొందరు తమ గాడ్ ఫాదర్లకు చెప్పుకుంటున్నారని సమాచారం. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా ఎవరికి వారు అధికారుల వద్దకు వెళ్లడం, తాము కేబినెట్ హోదా అని బెదిరించి పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆధిపత్యం కోసం కడియం, సురేఖ పోటీ
ఈ నేపథ్యంలో కొత్త నియామకాలతో జిల్లాలో పవర్ సెంటర్లు పెంచినట్లయిందని టీఆర్ఎస్ ముఖ్యుడొకరు చెప్పారు. ఇప్పటివరకు కొత్త జిల్లాల అధ్యక్షుల ఎంపిక జరగకపోగా.. అందరినీ ఊరిస్తూ ఉద్యమంలో మొదటినుంచి పనిచేసిన తమను కాదని ఎవరెవరికో పదవులు ఇస్తున్నారని మరికొందరు వాపోతున్నారు. ప్రధానంగా వరంగల్ నగరంలో ఇప్పటికే మేయర్ నరేందర్, ఎమ్మెల్యే కొండాసురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, డిప్యూటీ సీఎం కడియంలు తమ ప్రాధాన్యం కోసం పోటీ పడుతుండగా.. తాజాగా గుండు సుధారాణి జోడు పదవులతో వీరందరికంటే ఓ మెట్టు పైనే ఉన్నారని గులాబీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి.
ఏకీక్రుత పవర్ సెంటర్ కావాలని భావిస్తున్న సీఎం కేసీఆర్
మొత్తమ్మీద నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చూస్తుండగానే పూర్తవుతోంది సరికదా.. కొత్త వివాదాలకు మూలం అవుతోంది. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలలో భాగంగానే ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మొత్తంలో పదవుల భర్తీ జరుగుతోందట. ఏ ఒక్కరి ఆధిపత్యం కొనసాగకుండా మొత్తంగా పవర్ సెంటర్ అంతా అధిష్టానమే కావాలనేది ఇందులో గులాబీదళపతి అంతరంగమని పార్టీ సీనియర్ ఒకరు చెప్పారు. ఏదేమైనా.. ఈ కొత్త పదవులు.. అందులోనూ జోడు పదవులు ఎలాంటి వివాదానికి తెరతీస్తాయో.. ఈ వివాదాల్లో ఎవరిది పైచేయి అవుతుందో వేచిచూడాలి.