రిటైర్డ్ జడ్జీల కమిటీకి నో చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. ఆర్టీసీ సమ్మెపై కోర్టు తీర్పుపై ఉత్కంఠ
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. మరోపక్క తెలంగాణ ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అయితే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం ,ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చివరి ప్రయత్నంగా ముగ్గురు సుప్రీం రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని, ప్రభుత్వ అభిప్రాయం తెలియ చేయాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ కు సూచించింది. కానీ ప్రభుత్వం కమిటీకి నో చెప్పేసింది.
ఆర్ధిక ఇబ్బందుల్లో కత్తెర పట్టిన ఆర్టీసీ కండక్టర్ .. పస్తులుండలేక కూలీనాలీ చేస్తున్న కార్మిక లోకం
హైకోర్టు ప్రతిపాదన నిరాకరించిన తెలంగాణా ప్రభుత్వం
ముగ్గురు సుప్రీం రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేస్తే కమిటీ సూచనలకైనా 0.001% స్పందన వస్తుందేమోనని , చర్చల ప్రక్రియ మొదలవుతుందేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది హైకోర్టు . ఇక హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు స్వాగతించగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవసరం లేదని తేల్చి చెప్పేసింది. తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో చాలా కాలంగా వాదనలు కొనసాగుతున్నా పరిష్కారం మాత్రం దొరకడం లేదు.
సుప్రీం రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ పై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలన్న హైకోర్టు
గత కొద్దిరోజులుగా ఎడతెగని విచారణ కొనసాగుతున్నా ప్రభుత్వం తన పంధా వీడలేదు . దీంతో చివరి అవకాశంగా సుప్రీం రిటైర్డ్ న్యాయమూర్తులతో కూడిన హైపవర్ కమిటీ వేయాలని న్యాయస్థానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ముగ్గురు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేసి సమ్మె పరిష్కారం కోసం వారిని తగు సూచనలు చేయవలసిందిగా వారికి బాధ్యతలను అప్పగించాలని భావించింది హైకోర్టు . ఇక నిన్నటి విచారణ సందర్భంగా తీసుకున్న ఈ నిర్ణయంపై అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది.
కమిటీపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష... అవసరం లేదని కోర్టుకు తెలిపిన సర్కార్
అటు ఈ కమిటీపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. సుప్రీం మాజీ న్యాయమూర్తులతో కమిటీని వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇక దీంతో ఆర్టీసీ సమ్మెపై హైపవర్ కమిటీ అవసరం లేదని ఏజీ కోర్టుకు తెలిపారు. సమ్మె అంశం లేబర్ కోర్టు పరిధిలో ఉన్నందున లేబర్ కమిషన్ చట్టప్రకారం ఆదేశాలివ్వాలని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. ముగ్గురు జడ్జీల కమిటీ అవసరం లేదని, లేబర్ కమిషన్ చూసుకుంటుందని హైకోర్టుకు తెలియజేసింది.
మరికాసేపట్లో తీర్పు .. సర్వత్రా ఉత్కంఠ
దీంతో కాసేపట్లో హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై ఎటువంటి తీర్పు ఇవ్వనుందో అన్నది అందరిలోనూ ఉత్కంఠగా మారింది. ఏది ఏమైనా హైకోర్టు సైతం ప్రభుత్వాన్ని పలుమార్లు మానవతా దృక్పథంతో, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. కానీ ప్రభుత్వం హైకోర్టుకు సైతం తనదైన పంథాలో అఫిడవిట్లు దాఖలు చేస్తూ చట్టానికి లోబడే పనిచేస్తున్నామని తెలియజేస్తుంది. ఇక ప్రభుత్వ తాజా నిర్ణయంతో హైకోర్టు ధర్మాసనం ఏం చెయ్యనుందో తెలియాల్సి ఉంది.