విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎంసెట్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ నిబంధన రద్దు..
తెలంగాణలో ఎంసెట్ పరీక్షపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్లో ఇంటర్మీడియట్ వెయిటేజీ నిబంధనను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎంసెట్కు అర్హత సాధించిన విద్యార్థులందరికీ కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం లభించనుంది. గురువారం(అక్టోబర్ 29) నుంచి జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో... ప్రభుత్వం త్వరితగతిన దీనిపై నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మొదటిసారి పరీక్ష రాసి ఫెయిలైనవారు... లేదా కరోనా కారణంగా పరీక్ష రాయనివారు.. ఇలా అందరినీ 35 కనీస మార్కులతో ప్రభుత్వం పాస్ చేసింది. అయితే ఎంసెట్ నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్లో కనీసం 45శాతం మార్కులు ఉంటేనే కౌన్సెలింగ్కి పిలుస్తారు.
దీంతో ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులకు కూడా కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థులంతా హైకోర్టును ఆశ్రయించగా... న్యాయస్థానం కౌన్సెలింగ్ నిలిపివేయాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ వివరణ కోరగా... నిబంధనలు సవరిస్తామని చెప్పింది. చెప్పినట్లుగానే ప్రభుత్వం ఇవాళ సవరించిన నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4.11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ,బైపీసీ విద్యార్థులు 2,83,631 మంది ఉన్నారు. ఇందులో 1.75లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఎంసెట్కు కావాల్సిన 45శాతం కనీస మార్కులు పొందనివారికి... అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రూపంలో మరో అవకాశం ఉండేది. అందులో స్కోర్ పెంచుకుంటే ఆ తర్వాత ఎంసెట్కు అర్హత సాధించేవారు. కానీ ఈసారి ప్రభుత్వం కనీస మార్కులు 35తో ఫెయిలైనవారిని పాస్ చేయడంతో చాలామంది ఎంసెట్కు దూరమయ్యే పరిస్థితి తలెత్తింది.ప్రభుత్వం తాజాగా ఇంటర్మీడియట్ వెయిటేజీ నిబంధనను ఎత్తివేయడంతో విద్యార్థులకు ఊరట లభించినట్లయింది.