న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య: బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు, కేసీఆర్ సర్కారు సీరియస్
హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల దారుణ హత్య పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
దారుణం: హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య, నరికి చంపిన దుండగులు
వామన్ రావు దంపతుల హత్యకు కారణం అదే..
ప్రభుత్వ పెద్దలకు చెందని అవినీతి చిట్టా వామన్ రావు దగ్గర ఉందని బండి సంజయ్ చెప్పారు. న్యాయవాది దంపతుల హత్యపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అక్రమాలపై పోరాట చేయడమే వామన్ రావు దంపతుల హత్యకు కారణమని ఆరోపించారు. లాకప్ డెత్ సహా పలు అక్రమాలపై హైకోర్టులో పిటిషన్ వేసి, వాటిపైనే వామన్ రావు పోరాటం చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ పాలనతో అన్యాయానికి గురైన పేదల పక్షాన ఆయన పోరాడుతున్నారని చెప్పారు. వామన్ రావుకు రక్షణ కల్పించాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
న్యాయవాది దంపతుల హత్యపై కేసీఆర్ స్పందించాలి..
ప్రశ్నించే గొంతుకు రాష్ట్రంలో స్థానం లేదని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనమని బండి సంజయ్ అన్నారు. వామన్ రావు దంపతుల హత్యపై సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యలకు సీఎం కేసీఆర్ దే బాధ్యత అని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం మంథని నుంచి హైదరాబాద్ వస్తున్న వామన్ రావు దంపతులను పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద రహదారిపైనే దుండగులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.
వామన్ రావు దంపతుల హత్యపై కేసీఆర్ సర్కారు సీరియస్
ఇది ఇలా ఉండగా, న్యాయవాది వామన్రావు దంపతుల హత్యపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఈ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డితో హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ఈ హత్యలపై పకడ్బందీగా దర్యాప్తు చేయాలని డీజీపీ, నార్త్ జోన్ ఐజీ, రామగుండం సీపీని ఆదేశించారు.
ప్రాణహాని ఉందని చెప్పినా...: శ్రీధర్ బాబు
కాగా, హత్యకు గురైన లాయర్ దంపతులది మంథని మండలం గుంజపడుగు. వామన్ రావు దంపతుల హత్యతో గుంజపడుగులో విషాద ఛాయలు అలుముకున్నాయి. వామన్ రావు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుంట శ్రీనివాస్ తోపాటు మరో ఇద్దరు కలిసి వామన్ రావు దంపతులను హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ హత్య జరిగిందన్నారు. ప్రాణహాని ఉందని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు.