‘టీఎస్ఆర్టీసీ సమ్మెపై నిషేధం: విధులకు హాజరుకాకుంటే ఉద్యోగాలు పోగొట్టుకున్నట్లే’
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5 నుంచి చేపట్టే సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. శనివారం సాయంత్రం 6గంటలలోగా ఆర్టీసీ కార్మికులందరూ విధులకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.
పండగ సమయంలో సమ్మె చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. విధులు నిర్వహిస్తున్న కార్మికులకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని చెప్పింది. విధులకు హాజరుకాని వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది.
సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవే..: ఉద్యోగాలూడతాయంటూ పువ్వాడ అజయ్
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శుక్రవారం రాత్రి 11.10నిమిషాలకు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన సీఎం కేసీఆర్కు త్రిసభ్య కమిటీ నివేదికను అందజేశామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెపై నిషేధం ఉందని అన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం 6గంటలలోగా విధుల్లో చేరితేనే వారు ఉద్యోగాల్లో కొనసాగుతారు.. లేదంటే వారి ఉద్యోగాలను కోల్పోయినట్లేనని తేల్చి చెప్పారు. కార్మికులను బలిచేయవద్దని ఆర్టీసీ సంఘాలకు సూచించారు.
విధులకు హాజరుకానట్లయితే గడపదాటినట్లేనని అన్నారు. కార్మిక యూనియన్లతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కింది స్థాయి కార్మికులు బలికావద్దని కోరారు. దసరా, బతుకమ్మ పండగ సమయంలో సమ్మె చేస్తే ఆర్టీసీకి ఆదాయం రాకుండా పోతుందని అన్నారు.
ఆర్టీసీ యూనియన్లు బాధ్యతా రహితంగా వ్యవహరించవద్దని పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం 6గంటలలోపు విధులకు హాజరుకాని ఉద్యోగులు, కార్మికులు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నట్లేనని స్పష్టం చేశారు. యూనియన్ల ఉచ్చులో కార్మికులు, ఉద్యోగులు పడవద్దని వ్యాఖ్యానించారు. విధులకు హాజరయ్యే ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
గతంలో 44శాతం ఫిట్మెంట్ ఇచ్చామని, 16శాతం ఐఆర్ను కూడా ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికులను కూడా రెగ్యూలరైజ్ చేశామని చెప్పుకొచ్చారు. యూనియన్లు స్వలాభం కోసం కార్మికులను బలి చేస్తున్నాయని, దాన్ని గమనించాలని ఉద్యోగులు, కార్మికులకు సూచించారు. డిపో మేనేజర్లకు శనివారం సాయంత్రం 6గంటలలోగా కార్మికులు, ఉద్యోగులు రిపోర్ట్ చేయాలని సూచించారు. శనివారం తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటామని, వాహనాలను అద్దెకు తీసుకుంటామని చెప్పారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేస్తున్నామని వివరించారు. ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువ బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు రవాణా అధికారులు. ప్రతి మూడు నిమిషాలకో మెట్రో రైలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.