టిలో రెండు విడతల్లో కొత్త జిల్లాలు: ఈ జిల్లాల్లో ఇవీ...!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తూనే, మరోవైపు పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాల సంఖ్య ఆధారంగా కేంద్రం నిధుల కేటాయింపులు జరుపుతుండటంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అధికార వికేంద్రీకరణతోపాటు ప్రజలకు మరింత చేరువ కావడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
పైగా తమ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టు అవుతుందని, వీటిపై దృష్టి సారించడానికి అది మరో కారణమని అంటున్నారు. కేంద్రం ఇచ్చే నిధులు జిల్లాల సంఖ్య ఆధారంగానే వస్తున్నాయి. దీంతో ఎక్కువ మొత్తంలో నిధులు రాబట్టుకునేందుకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ యోచనగా కనిపిస్తోందంటున్నారు.
తెలంగాణలో జిల్లాల్లో జనాభా సగటు 29 లక్షలు ఉండవచ్చునని తెలుస్తోంది. 15 లక్షలకు ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోన్నట్టుగా సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం పది జిల్లాలు ఉండగా, అదనంగా మరో 14 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా చాలారోజులుగా వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్ను నాలుగు జిల్లాలుగా విభజించి, మిగతా తొమ్మిది జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉందంటున్నారు. మొదటి విడతలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కొంత భాగం, నిజామాబాద్ జిల్లాలను మినహాయించి, మిగతా ఏడు జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఏడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయని తెలుస్తోంది.
అయితే కొత్త జిల్లాల ప్రతిపాదన పట్ల కొన్ని జిల్లాల్లో పార్టీలోనూ, ప్రతిపక్షంలోనూ ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటును రెండు విడతల్లో చేపట్టి, మొదటి విడతలో ఎనిమిది జిల్లాల ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నట్టు కేసీఆర్ ఇటీవల జిల్లాల పర్యటనలలో బహిరంగంగానే ప్రకటనలు చేశారు.
మొదటి విడతలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఎనిమిది జిల్లాల్లో మెదక్ జిల్లా సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, నల్గొండ జిల్లా సూర్యాపేట, ఖమ్మం జిల్లా కొత్తగూడెం, కరీంనగర్ జిల్లా జగిత్యాల, వరంగల్ జిల్లా జనగామ (ఆచార్య జయశంకర్ జిల్లా), మహబూబ్నగర్ జిల్లా వనపర్తి లేక నాగర్కర్నూల్, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
రెండవ విడతలో ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాలపై ప్రభుత్వంలో ఇంకా స్పష్టత లేదని తెలుస్తోంది. హైదరాబాద్ సౌత్ (చార్మినార్ జిల్లా), హైదరాబాద్ వెస్ట్ (గోల్కొండ జిల్లా), హైదరాబాద్ నార్త్, ఈస్ట్ (సికింద్రాబాద్ జిల్లా), హైదరాబాద్ సెంట్రల్ (హిమాయత్నగర్ జిల్లా) ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, నిజామాబాద్, మెదక్ జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి వీటిలో కొంత భాగాన్ని మెదక్ జిల్లా నుంచి, అలాగే కొంత భాగాన్ని రంగారెడ్డి జిల్లా నుంచి సికింద్రాబాద్ జిల్లాల్లో కలపాలన్న ప్రతిపాదనలు ఉన్నట్టుగా సమాచారం.