అసెంబ్లీ రద్దు వెనుక మరో కోణం: హైదరాబాద్ టు ఢిల్లీ, కేసీఆర్ 'ట్రిపుల్' ప్లాన్
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయనున్నారు. అసెంబ్లీ రద్దుకు పలు రకాల కారణాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం, 2019 లోకసభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలనుకోవడం వంటి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
అందుకే వెంటనే: కేంద్రం-టీఆర్ఎస్పై బాబు సంచలనం, తెలంగాణకు సోనియా
అసెంబ్లీ టర్మ్ మరో ఏడెనిమిది నెలలు ఉండగానే కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో 119 స్థానాలకు గాను తెరాస 63, కాంగ్రెస్ 21, టీడీపీ 15, వైసీపీ 3, మజ్లిస్ ఏడు, బీజేపీ 5 స్థానాలు గెలిచింది. ఆ తర్వాత చాలామంది ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరారు. దీంతో తెరాస బలం ఇప్పుడు దాదాపు 90 వరకు ఉంది.
అసెంబ్లీ సీట్ల పెంపు, లోకసభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి
అసెంబ్లీ రద్దు నేపథ్యంలో కేసీఆర్కు సన్నిహితంగా ఉన్నవారు 'వన్ ఇండియా'కు తెలిపిన వివరాల మేరకు... తెరాస తిరిగి అధికారంలోకి రావడం ఖాయమం. ఇప్పుడు ముందస్తుకు వెళ్తే 2019లో లోకసభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించవచ్చునని కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే ఇప్పుడు ముందస్తుకు వెళ్లి సొంతగా (అంటే తెరాసకు) అతి ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం. ఆ తర్వాత లోకసభ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం.
జాతీయ రాజకీయాలపై దృష్టి కోసం
కేసీఆర్ గత కొద్ది నెలలుగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్సేతర ఫ్రంట్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. 2019లో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడానికి కేసీఆర్కు వీలు దొరకదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జాతీయస్థాయిపై దృష్టి సారించాలంటే, జాతీయ పార్టీల నేతలతో మాట్లాడి ఫ్రంట్లోకి తీసుకు రావాలంటే అసెంబ్లీ ఎన్నికలు ముందే జరగాలని కేసీఆర్ భావించారని తెలుస్తోంది.
కాంగ్రెస్కు దూరమే
కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఫ్రంట్లో ఉండేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే తెరాసకు ప్రధాన ప్రతిపక్షం. కాబట్టి జాతీయస్థాయిలో ఆ పార్టీ ఉన్న ఫ్రంట్కు నో చెబుతున్నారు. అయితే ఆయన బీజేపీకి దగ్గరగా కనిపిస్తున్నారు. ప్రధాని మోడీతో పలుమార్లు భేటీ అయ్యారు. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంసమయంలో, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ బీజేపీకి మద్దతు పలికింది.
బీజేపీకి ఇప్పుడు దూరమే.. కానీ లోకసభ ఎన్నికల తర్వాత పొత్తు
ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి ఎక్కువ స్థానాలు గెలిచి, ఆ తర్వాత 2019 లోకసభ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 2014లో వచ్చినన్ని లోకసభ స్థానాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో దక్షిణాదిలో పలు పార్టీలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. టీఆర్ఎస్, అన్నాడీఎంకే వంటి పార్టీలు బీజేపీకి ఫేవర్గా ఉన్నాయి. లోకసభ ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోనప్పటికీ, ఎన్నికల తర్వాత అవసరాన్ని బట్టి కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
మొత్తంగా ఈ మూడు కారణాలు
ముందస్తు ఎన్నికలు వచ్చినా, టైమ్ ప్రకారం వచ్చినా తెరాస ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో అద్భుత విజయం సొంతం చేసుకుంటామని చెప్పారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 2019లో లోకసభ కోసం సరైన అలయెన్స్ కోసం సమయం దొరుకుతుందని తెరాస నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా.. ముందస్తుతో ఒకటి... లోకసభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా జాతీయస్థాయిలో చక్రం తిప్పడానికి, రెండు.. పుంజుకుంటున్న కాంగ్రెస్ను దెబ్బకొట్టేందుకు, మూడు.. లోకసభ ఎన్నికల్లో బీజేపీ అనుకూలంగా ఉండటం ద్వారా అసెంబ్లీ సీట్లపై ప్రభావం పడకుండా ఉంటుందని తెరాస నేతలు భావిస్తున్నారని అంటున్నారు.