సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల తొలగింపు..కేసీఆర్ నిర్ణయంతో ప్రభుత్వం కూలటం ఖాయం: లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. నిన్న సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆడవాళ్ళ వేష ధారణలో ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు బతుకమ్మలను ఆది తమ నిరసన తెలియజేశారు. ఇక సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి 5వ తేదీ సాయంత్రం 6గంటల్లోపు విధుల్లో చేరని వారిని ఉద్యోగులుగా పరిగణించమని వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నామని చెప్పి షాకింగ్ ప్రకటన చేశారు. దీంతో ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు సీఎం కేసీఆర్ నిర్ణయంపైన భగ్గుమంటున్నాయి.
ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపధ్యంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నామని చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వ శాఖలో విలీనం చెయ్యనని , విధులకు హాజరు కానివారు ఆర్టీసీ ఉద్యోగులు కారని, భవిష్యత్ లోనూ వారికి ఎలాంటి అవకాశం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఎవరూ దీని గురించి భయపడవద్దని , ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవసరమైతే న్యాయస్థానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు రాజకీయ వర్గాలు, ఉద్యోగ సంఘాల నాయకులు.
దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించకుండా అణిచివేస్తామని సీఎం కేసీఆర్ చెప్పటం సరికాదని అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని, కార్మికులను తొలగిస్తే, త్వరలోనే ప్రభుత్వాన్ని ప్రజలు కూలుస్తారని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇప్పుడు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజాసమస్యలను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమింపజేయాలని కోరాలే తప్ప, ఫాంహౌస్ నిర్ణయాలను ప్రజలపై రుద్దడం సరికాదని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చరించారు.
ఆర్టీసీ సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీజేపీ నేత లక్ష్మణ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రయత్నం చెయ్యకపోగా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను తొలగించామని చెప్పటం హేయమైన చర్య అని లక్ష్మణ్ మండిపడ్డారు . ఇది కేసీఆర్ నిరంకుశ విధానాలకు నిదర్శనం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ సైతం పోరాటం చేస్తుందని లక్ష్మణ్ తేల్చి చెప్పారు.