బతుకమ్మ గొప్పదనం అదే: ఆయుధ పూజలో తెలంగాణ గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దసరా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కొద్దిరోజుల కిందటే రాజ్ భవన్ లో స్వయంగా బతుకమ్మ ఆడిన గవర్నర్.. తాజాగా ఆయుధ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్ భవన్ భద్రతా సిబ్బంది, పోలీసులకు కేటాయించిన తుపాకులకు తన కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఇటీవలే ఆమె రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. స్వయంగా బతుకమ్మను ఆడారు. బతుకమ్మ పాటలను ఆలపించారు. ప్రస్తుతం రాజ్ భవన్ లో దసరా వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి రాజ్ భవన్ ప్రాంగణంలో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. సద్దుల బతుకమ్మ వంటి తెలంగాణ సంప్రదాయబద్ధ పండుగను నిర్వహించారు. దసరా వేడుకల్లో భాగంగా రోజూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా పాఠశాల విద్యార్థులతో విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కూచిపూడి, భరత నాట్యం వంటి నృత్య ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. విజయదశమి వరకూ ఈ వేడుకలు కొనసాగనున్నాయి.
ఇందులో భాగంగా గవర్నర్ ఆయుధ పూజ చేశారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ సంప్రదాయాలు భిన్నత్వంలో ఏకత్వాన్ని నింపుకొన్నాయని ఈ సందర్భంగా తమిళిసై అన్నారు. దైవంతో సమానంగా పువ్వులను పూజించే సంప్రదాయం దేశంలో మరెక్కడా లేదని ప్రశంసించారు. ప్రకృతి వనరులను తెలంగాణ ప్రజలు ఎంతగా ఆరాధిస్తారనడానికి ఈ పండుగ ఓ ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు. ఏ మాత్రం పరిచయం లేకపోయినప్పటికీ.. బతుకమ్మ పండుగ విశిష్ఠత, ఔన్నత్యం తనను ఆశ్చర్యానికి గురి చేశాయని అన్నారు. బతుకమ్మ విశిష్టత, ఆడే విధానాన్ని తాను అదే పనిగా తెలంగాణ మహిళలను అడిగి తెలుసుకున్నానని, చెప్పుకొచ్చారు.