కేసీఆర్ మిస్సింగ్ అంటూ తీన్మార్ సంచలనం: గవర్నర్ తమిళిసై ఎంట్రీ: కాస్సేపట్లో ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్: కరోనా వైరస్ వల్ల తెలంగాణలో ఏర్పడిన పరిస్థితులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ప్రతికూలంగా పరిణమిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తొలిరోజుల్లో విస్తృతంగా అధికారులతో సమీక్షలు, విలేకరుల సమావేశాలను ఏర్పాటు చేసిన ఆయన.. ప్రస్తుతం కనిపించట్లేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కొద్దికాలంగా కేసీఆర్ మీడియా ముందుకు రావట్లేదు. కిందటి నెల 28వ తేదీన ఆయన చివరిసారిగ మీడియా ముందుకొచ్చారు. కరోనా స్థితిగతులపై అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
తిరుపతిలో దారుణం: జేసీబీతో కరోనా పేషెంట్ మృతదేహాన్ని ఖననం చేసిన వైనం: సస్పెండ్ చేసినా
ప్రత్యర్థులకు అందివచ్చిన అవకాశంగా..
ఈ ప్రతికూల పరిస్థితులను రాజకీయ ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కేసీఆర్ను ఇరుకున పెట్టడానికి అందివచ్చిన ఈ అవకాశాన్ని ఏ మాత్రం జారవిడుచుకోదలచుకోలేదు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా గులాబీ బాస్పై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. కేసీఆర్ ఏమయ్యారంటూ మొన్నటి వర్చువల్ భేటీ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి ప్రశ్నించిన వెంటనే.. Where is KCR అనే పదం ట్రెండింగ్లోకి వచ్చిందంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.
అన్నీ ప్రతికూలతలే..
కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడంలో, అది వ్యాప్తి చెందడాన్ని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే వెనుకపడిందనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వందల కొద్దీ పుట్టుకుని వస్తుండటం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి హాట్స్పాట్గా మారడం, లాక్డౌన్ విధిస్తారనే భయంతో వందలాదిమంది పొరుగునే ఉన్న ఏపీకి ప్రయాణం కట్టడం.. ఈ పరిణామాలన్నీ కేసీఆర్ సర్కార్కు ప్రతికూలంగా మారాయి.
11 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ సమీక్ష..
ఈ పరిస్థితుల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. కరోనా వైరస్ రాష్ట్రంలో ఏర్పడిన స్థితిగతులను ఆరా తీయడానికి ఆమె ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.. రాజ్భవన్లో. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల డాక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో తమిళిసై భేటీ కాబోతున్నారు. ఈ ఉదయం 11 గంటలకు రాజ్భవన్లోని దర్బార్ హాలులో ఈ సమావేశం ఏర్పాటు కానుంది.
ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లతో కీలక భేటీ..
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, నిమ్స్, అపోలో వంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు, కోవిడ్ కేర్ సెంటర్ల ప్రతినిధులు, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ భేటీకి హాజరు కానున్నారు. నిజానికి- ఆమె సోమవారం సాయంత్రమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో రాజ్భవన్లో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ..కుదరలేదు. తాము రాలేమంటూ సమాచారం ఇచ్చారు. ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ వల్ల తాము రాజ్భవన్ రాలేకపోతున్నామనే కారణాన్ని వివరించారు.
విమర్శలకు మరింత పదును..
ఆ వెంటనే తమిళిసై.. ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లతో భేటీకి పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తానే స్వయంగా రంగంలోకి దిగాననే సంకేతాన్ని కేసీఆర్ సర్కార్కు పంపించినట్టయింది. ఈ భేటీ తరువాత రాజకీయ ప్రత్యర్థులు ప్రభుత్వంపై తమ దూకుడు మరింత పెంచే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. తమ విమర్శలకు మరింత పదును పెట్టడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్పై దాడి చేయడానికి ఏ ఒక్క అవకాశాన్నీ వదలుకోవట్లేదు కాంగ్రెస్, బీజేపీ నేతలు.
Recommended Video
కేసీఆర్ మిస్సింగ్ అంటూ..
ఇదిలావుండగా.. కేసీఆర్ కనిపించట్లేదంటూ తీన్మార్ మల్లన్న ఓ సంచలన ట్వీట్ చేశారు. కేసీఆర్ మిస్సింగ్ అంటూ ఓ వీడియోను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎక్కడున్నావ్ బిడ్డా, ఏ దేశంలోనున్నవ్ కొడకా, ఒక్కసారి చూస్తా బిడ్డా నిన్ను.. అంటూ తనదైన శైలిలో ఓ పాటను దానికి జత చేశారు. కేసీఆర్ లాస్ట్ సీన్ ప్రెస్మీట్ అని, తెలుపురంగు షర్టు, అదే రంగు ప్యాంటు ధరించి ఉంటారని ఐడెంటిఫికేషన్ ఇచ్చారు. త్వరలో రైతులకు శుభవార్త అని చెప్పి పోయిండు.. ఇంకా తిరిగి రాలేదు అని క్యాప్షన్ పెట్టారు. పొట్ట చేత పట్టుకుని పోయిన కేసీఆర్ మళ్లీ తిరిగి రాలేదంటూ వ్యంగ్యాన్ని జోడించారు.