కేసీఆర్ సాహసోపేత నిర్ణయం: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే: ఆర్టీసీ కార్మికులకు బంపర్: దండిగా బడ్జెట్..
హైదరాబాద్: గత ఏడాది తెలంగాణలో చోటు చేసుకున్న కీలక ఘట్టాల్లో ఒకటి.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల సమ్మె. 60 రోజులకు పైగా కొనసాగిన ఈ సమ్మె.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేలాదిమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలను తెలియజేశారు. ప్రజా రవాణాను స్తంభింపజేశారు. పలువురు కార్మికుల ఆత్మహత్యలకు కూడా కారణమైంది ఈ సమ్మె. ఈ సమ్మెను విరమింపజేయడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొన్ని వరాలను కార్మికులకు ప్రకటించారు.. వాటిని అమలు చేయనున్నారు.
నాడు ఏం చెప్పారంటే..
ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేయడానికి కేసీఆర్ పలు వరాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి ఏటా 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తామని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క రూటును కూడా ప్రైవేటీకరించబోమని భరోసా ఇచ్చారు. ప్రతి ఆర్టీసీ ఉద్యోగికి ఏడాదికి రూ.లక్ష బోనస్ అందించే పరిస్థితిని తీసుకొస్తామని చెప్పారు.
రూ.1000 కోట్లు కేటాయింపు..
గతంలో తాను చేసిన హామీని నిలబెట్టుకున్నారు కేసీఆర్. చెప్పినట్టుగానే వార్షిక బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలను కేటాయించారు. కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు, ఆర్టీసీ కార్మికులకు సవరించిన ఫిట్మెంట్..వంటి అవసరాల కోసం ఈ మొత్తాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు- ఆర్టీసీ కార్మికులకు ప్రకటించిన లక్ష రూపాయల బోనస్ను కూడా ఇందులో నుంచే కేటాయించుకోవాల్సి ఉండేలా ఏర్పాట్లు చేశారు.
కేసీఆర్ సాహసోపేతం..
రోడ్డు రవాణా సంస్థకు స్వతహాగా స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ప్రభుత్వం నుంచి పెద్దగా ఆర్థికంగా అండదండలు లభించవు. సొంతంగా నిధులను సమకూర్చుకోవడం, సంస్థను నడుపుకోవడం.. అదే పరిస్థితి కనిపిస్తుంటుంది ఏ రాష్ట్రంలోనైనా. ఏపీ దీనికి మినహాయింపు. ఎందుకంటే- అక్కడి ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలనీం చేసింది కాబట్టి. అలాంటి ఆర్టీసీకి ప్రతి సంవత్సరమూ 1000 కోట్ల రూపాయల మేర బడ్జెట్ను కేటాయించడం అంటే మాటలు కాదు. కేసీఆర్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయంగా దీన్ని చెప్పుకోవచ్చు.
స్వయం సమృద్ధి సాధించేంత వరకూ
ఆర్టీసీని వైట్ ఎలిఫెంట్గా భావిస్తుంటాయి ప్రభుత్వాలు. ఏటేటా నష్టాలు తప్ప లాభాలు రాని ఆర్టీసీని గుదిబండలాగా ఫీలవుతుంటాయి. అలాంటి ఆర్టీసీ.. స్వయం సమృద్ధి దిశగా నడిపించేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయాలను తీసుకోవడం వెనుక ఆ సంస్థ ఉద్యోగుల త్యాగాలు లేకపోలేదు. 60 రోజులకు పైగా సమ్మెను విజయవంతం చేయడమే దీనికి నిదర్శనం. ఆ సమ్మె అనేదే లేకపోయి ఉంటే కేసీఆర్ ఇలాంటి సాహసోపేత నిర్ణయాలను తీసుకునే వారు కాదనే అంటున్నారు విశ్లేషకులు.