దేశానికే తలమానికంలా..: పోలీస్ ట్విన్ టవర్స్కు భారీగా బడ్జెట్: చెప్పినదాని కంటే ఎక్కువే..
హైదరాబాద్: ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్..తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఓ భారీ ప్రాజెక్టు.. అత్యంత ఆధునికమైనది కూడా. పోలీసు వ్యవస్థను ఆధునికీకరించడంలో భాగంగా కేసీఆర్ సర్కార్ నిర్మిస్తోన్న కంట్రోల్ సెంటర్కు భారీగా నిధులను కేటాయించింది. ముందుగా ప్రకటించిన మొత్తం కంటే అధిక నిధులను బడ్జెట్ ప్రతిపాదనల్లోకి చేర్చింది. ఏకంగా 550 కోట్ల రూపాయలను దీనికోసం ప్రతిపాదించింది.
ఈ భారీ ప్రాజెక్టు కోసం 350 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయిస్తామని ఇదివరకు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకున్న కేసీఆర్ సర్కార్.. చెప్పినదాని కంటే 200 కోట్ల రూపాయల మొత్తాన్ని అధికంగా కేటాయించింది. 550 కోట్ల నిధుల మొత్తాన్ని బడ్జెట్ ప్రతిపాదనల్లోకి చేర్చింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ టవర్ అందుబాటులోకి వచ్చేలా నిర్మాణాన్ని పూర్తి చేయడానికే ఆశించిన దాని కంటే అధికంగా నిధులను కేటాయించినట్లు చెబుతున్నారు.
బంజారాహిల్స్లో నిర్మితమౌతోన్న పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే తలమానికంలా రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో మారుమూల ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్నప్పటికీ.. దాని సమాచారం వెంటనే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కు అందుతుంది. సత్వరమే సంబంధిత పోలీస్ స్టేషన్కు ఇక్కడి దాని వివరాలు వెళ్తాయి. అసాంఘిక శక్తుల కదలికలను గుర్తించడానికి అవసరమైన అత్యాధునిక వ్యవస్థను ఈ కంట్రోల్ రూమ్లో అందుబాటులోకి తీసుకుని రానున్నారు.
జీ ప్లస్ 19, జీ ప్లస్ 14 తరహాలో ఈ టవర్స్ రూపుదిద్దుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి ఇదే ప్రధాన కార్యాలయంగా కొనసాగుతుంది. లక్ష సీసీటీవీ కెమెరాలను ఒకేసారి విశ్లేషించేంతటి సామర్థ్యం గల ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నారు ఈ టవర్స్లో. ట్రాఫిక్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, క్రైమ్ కంట్రోల్ ప్రాసెస్, కంట్రోల్ సెన్సర్స్, నెట్వర్క్ డివైసెస్, జీఐఎస్, ఇంటిగ్రేటెడ్ డయల్ 100, టెర్రెస్ట్రియల్ ట్రంక్డ్ రేడియో వంటి వ్యవస్థను ఇందులో సమకూర్చనున్నారు.