ఆర్టీసీ సమ్మె తేలిపోతుందా: ప్రభుత్వం కార్మిక సంఘాల చూపు అటువైపే: ఆ తరువాతనే...!
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేడు తేలిపోతుందా. ప్రభుత్వం..కార్మిక సంఘాల తో సహా సాధారణ ప్రజానీకం సైతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీ సమ్మె ఆరో రోజుకు చేరింది. ఈ సమ్మె మీద ప్రభుత్వం కఠిన వైఖరితో ఉంది. ఆర్టీసీ జేఏసీ నేతలు సైతం రాజకీయ పార్టీలు..ప్రజా సంఘాల మద్దతుతో సమ్మెను మరింత తీవ్రతరం చేయాలని భావిస్తున్నాయి. ఇక, ప్రతిపక్ష పార్టీలు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నాయి.
ఇలా..ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో ఉండగా సాధారణ ప్రజలు మాత్రం నిస్ససహాయం ఈ రోజు తమ సమస్యలకు పరిష్కారం లభించదా అనే ఆశతో ఉన్నారు. హైకోర్టులో ఈ రోజు ఆర్టీసీ సమ్మె పైన విచారణ జరగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వంతో పాటుగా కార్మిక సంఘాలు నోటీసులకు సమాధానం ఇవ్వనున్నాయి. హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా తదుపరి అడుగులు వేయాలని అటు ప్రభుత్వం..ఆటు ఆర్టీసీ కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు అందరి చూపు హైకోర్టు వైపే..
నేడు హైకోర్టులో సమ్మె కేసు విచారణ..
హైకోర్టులో తెలంగాణ ఆర్టీసీ సమ్మె కేసు నేడు విచారణకు రానుంది. నాలుగు రోజుల క్రితం దాఖలైన హౌస్ మోషన్ పిటీషన్ పైన అటు ప్రభుత్వానికి..ఇటు కార్మిక సంఘాలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు కేసు ఈ రోజుకు పోస్టు చేసింది. ప్రభుత్వం..కార్మిక సంఘాలు ఇచ్చే వివరణ ఆధారంగా హైకోర్టు విచారణ సాగించనుంది. ప్రభుత్వం ఇప్పటికే తాము ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని నివేదించింది. అదే విధంగా కార్మిక సంఘాలు సైతం తమ వివరణ కోర్టు ముందు ఉంచనున్నారు. కోర్టు ఈ విషయంలో ఏ రకంగా స్పందిస్తుందీ..మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా అనే విషయంలో అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాలు ఆసక్తిగా ఉన్నాయి. డిపోల వారీగా సమ్మె ప్రభావం గురించి ఆర్టీసీ ఈ రోజు కోర్టుకు నివేదించనుంది.
కోర్టు నిర్ణయం తరువాతనే కార్యాచరణ..
కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 1200 మంది మాత్రమే ఆర్టీసీలో ఉద్యోగులుగా ఉన్నారని..మిగిలిన వారు వారంతటగా వారే తమ ఉద్యోగాలను సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారంటూ ఉద్యోగుల మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఇటు వైపు ప్రతిపక్ష పార్టీలు..ప్రజా సంఘాలు సైతం ఆర్టీసీ జేఏసీకీ మద్దతుగా నిలుస్తున్నాయి. కోర్టు తీర్పు తరువాత తెలంగాణ బంద్ తో పాటుగా భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని మరింతగా సాగదీయకుండా త్వరితగతిన పరిష్కరించాలని భావిస్తోంది.
రాజకీయంగా నష్టం..ప్రతిపక్షాలకు ఛాన్స్
ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా ప్రతిపక్షాలు రంగంలోకి దిగటంతో రాజకీయంగా వారికి అవకాశం ఇచ్చినట్లవుతుందని అధికార పార్టీ భావిస్తోంది. రాజకీయ పార్టీల ఐక్యంగా ప్రభుత్వం పైన పోరాడేందుకు దీనిని అస్త్రంగా మలచుకుంటున్నాయి. దీంతో..ప్రభుత్వం సైతం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కొన్ని ఉద్యోగ..విద్యార్ధి సంఘాలు సైతం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తుండటం పైనా ప్రభుత్వం ఆరా తీస్తోంది. కోర్టు నుండి ఈ రోజు నిర్ణయం రాకుంటే సమ్మె ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ చర్యలను ముమ్మరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.