ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా .. అమరవీరులకు అసెంబ్లీ సంతాపం
Recommended Video
హైదరాబాద్ : పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర వాదులు చేసిన దాడిని తెలంగాణ అసెంబ్లీ ఖండించింది. అమరవీరులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. శుక్రవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ప్రసంగించారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించారు. దాడిలో మృతిచెందిన వీరుల సేవలను సర్మించుకున్నారు. ఆయా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయాలైన జవాన్లు కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా
ఉగ్ర దాడిలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు సీఎం కేసీఆర్. ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షలు అందజేస్తామని అసెంబ్లీలో తెలిపారు. ముష్కరుల దాడిలో చనిపోయిన వీరులు తిరిగిరాలేరని .. కానీ మనం చేసే సాయం కుటుంబసభ్యులకు ఆర్థిక భరోసానిస్తుందని తెలిపారు.
దేశంపై జరిగిన దాడి ఇది ..
సంతాప తీర్మానంపై కేసీఆర్ తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ .. ఉగ్రవాదుల చర్యలను ఖండించారు. జవాన్లపై జరిగిన దాడి యావత్ భారత్ పై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఉగ్రదాడులు జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సంతాప తీర్మానానికి మద్దతు తెలిపారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని ఎంఐఎం అభిప్రాయపడింది. ముష్కరులపై ఉక్కుపాదం మోపాలని ఎంఐఎం సభ్యుడు బలాల అన్నారు. మనమంతా టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీ తరపున మాట్లాడిన రాజాసింగ్ తీర్మానానికి మద్దతు తెలిపారు.