సస్పెన్స్కు తెర: ఎంసెట్ 3 షెడ్యూల్ ఇదే, 2పై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: ఎంసెట్-3 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం నాడు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 11న పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది.
ఎంసెట్ 3 కన్వీనర్గా జేఎన్టీయూ రిజిస్ట్రార్ యాదయ్య వ్యవహరించనున్నారు. ఎంసెట్ 3 నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం మళ్లీ జేఎన్టీయూకే అప్పగించిన విషయం తెలిసిందే. ఎంసెట్ 3 నిర్వహించనుండటంతో ఎంసెట్ 2పై నెలకొన్న సందిగ్ధత వీడింది.
ఎంసెట్ 2 రద్దు, 200 మంది పేరెంట్స్కు శిక్ష తప్పదు: కేసీఆర్
ఎంసెట్ 2 లీకేజీపై హైకోర్టులో విచారణ
తెలంగాణ ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యాహ్నం రెండున్నర గంటల్లోగా నిర్ణయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రశ్నపత్రం లీకైనట్లు విచారణలో తేలిందని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది.
103 మంది అక్రమంగా ర్యాంకులు పొందినట్లు తేలిందని, సీఐడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పిటిషనర్ కోరగా, ముందు ప్రభుత్వం నిర్ణయం ఏమిటో తెలపాలని హైకోర్టు పేర్కొంది.
సీఐడీ విచారణను హైకోర్టు పర్యవేక్షించాలని పిటిషనర్ కోరగా, దర్యాప్తు సంస్థలపై నమ్మకం ఉంచాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆ తర్వాత ప్రభుత్వం.. ఎంసెట్ 2ను రద్దు చేసినట్లు హైకోర్టుకు తెలిపింది. ఎంసెట్ 3కి షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పింది.