తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు: ఛైర్మన్గా ఎర్రోళ్ల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇందుకు సంబంధించిన ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. వీటికి సంయుక్త చైర్మన్గా సిద్ధిపేట జిల్లా చిన్న కోడూరు మండలం ఘణపూర్కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ నియమితులయ్యారు.
సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం రాంబాల్ నాయక్ (రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం, రాయగూడ), సుంకపాక దేవయ్య( హైదరాబాద్ నగరంలోని రాంనగర్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల)లను నియమించారు.
మేడారం జాతరకు కేంద్రమంత్రికి ఆహ్వానం
న్యూఢిల్లీ: ప్రసిద్ధ గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాల్సిందిగా కోరుతూ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. కేంద్ర గిరిజనశాఖ మంత్రి జువల్ ఓరమ్కు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా మంత్రి జాతర విశిష్టతను కేంద్ర మంత్రికి వివరించారు. అదేవిధంగా సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
మేడారం జాతరకు గిరిజన కుంభమేళాగా పేరుందన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజిన జాతర సమ్మక్క-సారలమ్మ జాతర అని వివరించారు.
జాతరకు జార్ఖండ్, మధ్యప్రవేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తోపాటు పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని వెల్లడించారు. మేడారం జాతరలో గతేడాది 90 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొన్నారని తెలిపారు. కాగా, ఈ ఏడాది జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.