అక్కడ ఆన్ లైన్ సినిమా టిక్కెట్లు రద్దు : స్వయంగా వెల్లడించిన మంత్రి..!!
సినీ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి ఆన్ లైన్ సినిమా టిక్కెట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రకరకాల యాప్ లు.. బుక్ మై షో.. పేటీఎం వంటి వాటి ద్వారా ప్రేక్షకులు సినిమా టిక్కెట్లు ఎక్కడ కావాలంటే అక్కడ బుక్ చేసుకొనే వెసులుబాటు ఉంది. అయితే, వీటి కారణంగా ప్రేక్షకుల మీద భారం భారీగా పడుతోందని..దీంతో దీనిని రద్దు చేసి ప్రభుత్వమే సినిమా టిక్కెట్లు విక్రయించేలా ఒక సైట్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. ఇప్పటికే సినిమా హళ్లలో ధరలు పెరిగిపోయాయని .. ఇక ఈ ఆన్ లైన్ టిక్కెట్ల పేరుతో అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆన్ లైన్ టిక్కెట్ల విధానం రద్దు చేస్తే ఎటువంటి ప్రభావం ఉంటుందనే అంశం పైన అధికారులు సమాచారం సేకరిస్తున్నారని..వారి నివేదిక అందగానే దీని పైన నిర్ణయం తీసుకుంటామని తలసాని స్పష్టం చేసారు. ప్రభుత్వమే అధికారికంగా టిక్కెట్లను విక్రయించటం ద్వారా అన్ని రకాలుగా ప్రయోజనాలు ప్రేక్షకులకు దక్కుతాయని పేర్కొన్నారు.
అదే విధంగా సినిమా ధియేటర్లలో సీటింగ్ విధానంలో సైతం మార్పులు తెచ్చే ఆలోచన చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. హాల్స్ లో ఇప్పుడు అనుసరిస్తున్న విధానంలో మార్పులు తీసుకొస్తామన్నారు. 18 నుండి 20 లైన్లు.. 8 నుండి పది లైన్లలో సీటింగ్ ఏర్పాటు చేయాలనేది తమ ఆలోచనగా చెప్పారు. ప్రభుత్వం నుండి టిక్కెట్లు అమ్మకాలు చేపడితే నిర్మాతలతో పాటుగా డిస్ట్రిబ్యూటర్లు సైతం లాభపడతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు. ఇక..రేస్ కోర్స్ టాక్స్ పై స్పెషల్ డ్రైవ్ చేసామన్నారు.
గతంలో లక్షల్లో కట్టే పన్ను ఇప్పుడు కోట్లల్లో కడుతున్నారని వివరించారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా సినీ ప్రేక్షకులకు రక రకాలుగా అందుబాటులో ఉన్న ఆన్ లైన్ సినిమా టిక్కెట్లు ఇక నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసే వెబ్ సైట్ నుండి మాత్రమే అందుబాటులోకి రానున్నాయి.