వెనక్కి తగ్గని సీఎం కేసీఆర్: సమీక్షకు పిలుపు..రద్దు: ఇక..చర్చలు లేనట్టేనా..!
ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపండి.. సమస్య పరిష్కరించండి..ఉదయం 10.30 గంటలకల్లా చర్చలు మొదలు పెట్టండి.. అంటూ హైకోర్టు సూచనలు చేసినా..ఆ దిశగా కదలిక కనిపించటం లేదు. కోర్టు ఈ అంశం పైన సీరియస్ వ్యాఖ్యలు చేయటం.. ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందంటూ వ్యాఖ్యానించటంతో ఇక..సమ్మె ముగింపు దిశగా అడుగులు పడతాయని అందరూ అంచనా వేసారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ సైతం సమీక్షకు రావాలంటూ అధికారులను తొలుత ఆదేశించారు. ఆ తరువాత సమీక్ష అవసరం లేదని తేల్చారు.
దీంతో..ముఖ్యమంత్రి ఈ విషయంలో వెనకడుగు వేయటానికి సిద్దంగా లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు బంద్ కొనసాగుతోంది. అరెస్ట్ లు ఆగటం లేదు. దీంతో..ఆర్టీసీ సమ్మె కేసు ఈ నెల 28కి వాయిదా పడటంతో...ఆ సమయం పూర్తిగా కార్మికులను ఆత్మరక్షణలో పడేసేందుకే ప్రభుత్వం ఆలోచన చేస్తుందా అనే అనుమానం కలుగుతోంది. బంద్ అయిపోయిన తరువాత మరో కార్యాచరణ ప్రకటనకు జేఏసీ సిద్దం అవుతోంది. దీంతో..అసలు ఈ వ్యవహారం ఎటు టర్న్ అవుతుందనే అనే ఉత్కంఠ కార్మికుల్లో కనిపిస్తోంది.
సమీక్షకు రమ్మన్నారు..రద్దు చేసారు..
హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు..చర్చల పైన చేసిన సూచనలతో ఖచ్చితంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు పిలుస్తుందని అందరూ ఆశించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ సమీక్షకు రావాలంటూ పిలుపు రావటంతో అధికారులు పూర్తి సమాచారంతో అక్కడకు చేరుకున్నారు.
గంట సేపు వేచి చూసిన తరువాత సమీక్ష లేదంటూ తేల్చారు. అయితే, కోర్టు ఆదేశాల కాపీ అందిన తరువాత దాని మీద సమీక్షించి..అప్పుడు అవసరమైన కార్యాచరణ ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది. హైకోర్టు కేసును తిరిగి ఈ నెల 28కి వాయిదా వేసింది. దీని ద్వారా దాదాపు పది రోజుల సమయం ఉండటంతో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని..అప్పటి వరకు తమ మాట కాదని సమ్మెకు దిగిన కార్మిక సంఘాలపైన ఒత్తిడి కొనసాగించాలనే వ్యూహం తో ప్రభుత్వం ఉన్నట్లుగా స్పష్ట మవుతోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి మాత్రం తన పైన ఆర్టీసీ అంశం లో రాజకీయ పార్టీలు..కార్మిక సంఘాలు చేస్తున్న విమర్శల మీద సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
ఇక..చర్చలు ఉండవా..
హైకోర్టుకు ప్రభుత్వం చేసిన సూచనల విషయంలో ఉన్నత స్థాయిలో ఆరా తీసారు. ప్రభుత్వం సైతం ఆర్టీసీ పరిస్థితి పైన కోర్టుకు నివేదిక ఇవ్వటం ద్వారా వాస్తవ పరిస్థితులు కోర్టు అర్దం చేసుకుందనే అభిప్రాయం ప్రభుత్వంలో వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో ర్మిక యూనియన్లు భయపెడితే భయపడాలా అన్న పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. పైగా, తదుపరి విచారణను పది రోజులపాటు అంటే, ఈనెల 28వ తేదీకి వాయిదా వేసిందని, అప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోకపోయినా పెద్దగా నష్టం లేదని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.
అందుకే కార్మిక సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీంతో, ఇప్పట్లో చర్చలు ఉండవని భావిస్తున్నారు.
అదే పట్టుదలతో యూనియన్లు...
ప్రభుత్వం తమ విధానం లో మార్పు లేదనే విధంగా.. పట్టుదలతో వ్యవహరిస్తోంది. చర్చల అవకాశమే లేదని తొలుత చెప్పిన విధంగానే..ఇప్పుడు ఆ అంశాన్ని పక్కన పెట్టేసిందనే విధంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సమ్మె 14వ రోజుకు చేరింది. తెలంగాణ బంద్ కొనసాగుతోంది. బంద్ ప్రభావం లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
ఇదే సమయంలో కార్మిక సంఘాలు సైతం తమకు రాజకీయ పార్టీలు..వివిధ వర్గాల జేఏసీల మద్దతు లభిస్తుండటంతో తాము వెనక్కు తగ్గకూడదనే భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే, ప్రభుత్వం చర్చలకు పిలిస్తే మాత్రం వెళ్తామని చెబుతోంది. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండకూడదని భావిస్తున్నాయి. ఆదివారం నుంచి సమ్మెను ఉద్ధృతం చేసే దిశగా కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించాయి. దీంతో..సోమవారం నుండి విద్యా సంస్థలు ప్రారంభం కానుండటంతో సమస్య తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తోంది.