ఉల్లి ధరలపై ఆందోళన వద్దు... రూ.35కే సబ్సిడీపై అందుబాటులో... : తెలంగాణ ప్రభుత్వం
కరోనా లాక్ డౌన్ పీరియడ్లో నాలుగు నుంచి ఐదు కిలోల ఉల్లి కేవలం రూ.100కే లభించింది. అలాంటిది... ఇప్పుడు ఒక్క కిలోకే ఏకంగా రూ.80 ధర పలుకుతోంది. అమాంతం పెరిగిన ఉల్లి ధరలు సామాన్యుడికి తీవ్ర భారంగా పరిణమించాయి. దీంతో ఆయా రాష్ట్రాలు సబ్సిడీపై ఉల్లిని విక్రయించేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా సబ్సిడీపై ఉల్లిని అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్లోని జంట నగరాల్లో ఉన్న రైతు బజార్లలో కేవలం రూ.35కే కిలో ఉల్లిని విక్రయించేందుకు చర్యలు తీసుకుంటోంది.
Recommended Video
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు. ఉల్లి ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సబ్సిడీపై ప్రతీ వ్యక్తికి రెండు కిలోల ఉల్లిని అందిస్తామన్నారు. సామాన్యులు ఎవరైనా సరే రైతు బజార్లలో తమకు సంబంధించిన ఏదైనా గుర్తింపు కార్డును చూపించి సబ్సిడీ ఉల్లిగడ్డలు పొందవచ్చునని తెలిపారు. భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతినడంతో ధరలు అమాంతం పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో లాభం గురించి ఆలోచించకుండా కేవలం రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిని అందిస్తోందన్నారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉల్లిధర రూ.80-రూ.90 వరకు పలుకుతోంది.కొన్నిచోట్ల ఉల్లి ధర రూ.100 కూడా దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాపారులు నిల్వ చేసే పరిమితులపై ఆంక్షలు విధించింది. అలాగే రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని తీసుకోవాల్సిందిగా కోరింది. దీంతో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు మొత్తం 8వేల టన్నుల ఉల్లిని తీసుకునేందుకు ముందుకొచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్ తెలిపారు.
మహారాష్ట్రలోని నాసిక్ బఫర్ స్టాక్ నుంచి కేంద్రం రూ.26-రూ.28కే ఉల్లిని సరఫరా చేస్తుందని లీనా తెలిపారు. అక్కడి నుంచి రాష్ట్రాలు తమ ఖర్చులతో ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా రాష్ట్రాలకే నేరుగా ఉల్లి లోడ్ను పంపించాలని కోరితే కిలో రూ.30 చొప్పున వసూలు చేస్తామన్నారు.
నిజానికి ఈ సీజన్లో 43లక్షల టన్నుల ఉల్లి దిగుబడి వస్తుందని కేంద్రం అంచనా వేసింది. కానీ అకాల వర్షాలతో పంట నష్టం జరగడంతో కేవలం 36లక్షల టన్నుల ఉల్లి మాత్రమే దిగుబడి అయింది. దీంతో బహిరంగ మార్కెట్లో ఉల్లి సప్లై తగ్గిపోవడం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధర అమాంతం పెరిగిపోయింది.