జలదిగ్బంధంలో హైదరాబాద్: విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి సెలవులు
హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు రేపు, ఎల్లుండి సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈఓ సోమిరెడ్డి గురువారం రాత్రి అధికారిక ప్రకటన చేశారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయం కావడం, కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
సహాయక చర్యలు ముమ్మరం
మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. మెహిదీపట్నం నుంచి లక్డీకాపూల్ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
ప్రయాణాలు మానుకోండి
ఇక లక్డీకాపూల్, పంజాగుట్ట మార్గంతోపాటు నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు, మలక్పేట్ గంజి నుంచి కోఠి వరకు ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో గంట వరకు ప్రయాణాలు మానుకోవాలని ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ నగరవాసులకు సూచించారు.
ఇంకా కుదట పడని నగరం
గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కూడా నగరంలోని పలు చోట్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్నగర్, సనత్నగర్, బోరబండలో భారీ వర్షం కురుస్తోంది. చార్మినార్, శాలిబండ, హుస్సేనిఆలం, పురాణాపూల్, బహదూర్ పుర, దూద్బౌలి, సిటీ కాలేజీ ఏరియాలో ఓ మోస్తరు వర్షం పడింది.
పలుచోట్ల చిరుజల్లులు
కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, బాలానగర్లో చిరు జల్లులు పడుతున్నాయి. భారీ వర్షం కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, అపార్టుమెంట్లు పార్కింగ్ స్థలాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
రంగంలోకి ఆర్మీ అధికారులు
అయితే, ఎడతెరిపి లేని వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుండటంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో, జీహెచ్ఎంసీ అధికారులు ఆర్మీ సాయం కోరారు. అధికారుల వినతి మేరకు ఆర్మీ రంగంలోకి దిగింది. ఆల్వాల్లో పర్యటించిన ఆర్మీ అధికారులు అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్ లో పోలియో వైరస్ కలకలం
హైదరాబాద్ నగరంలో మరోసారి పోలియో వైరస్ కలకలం రేగింది. అంబర్ పేట్- నాగోల్ మూసీనది నాలాలో పోలియో వైరస్ను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.