కరోనాకు హోమియో మెడిసిన్తో చెక్: కేసీఆర్ సర్కార్ ముందు జాగ్రత్త చర్య: ఫ్రీగా..!
హైదరాబాద్: చైనాలో జన్మించిన ప్రాణాంతక కరోనా వైరస్ క్రమంగా హైదరాబాద్ దాకా విస్తరించడం పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి కీలక నిర్ణయాలను తీసుకుంది. హోమియోపతి మందుల వినియోగంపై దృష్టి సారించింది. కరోనా తరహా ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందడాన్ని నిరోధించడానికి హోమియోపతిలో ఉన్న మందులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉచితంగా వాటి పంపిణీని చేపట్టింది.
ప్రాఫిలాక్టిక్ హోమియో మెడిసిన్ ద్వారా అడ్డుకట్ట..
ప్రాఫిలాక్టిక్ మెడిసిన్ మందులను ముందుగా తీసుకోవడం వల్ల కరోనా వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఆయూష్ విభాగం ద్వారా ఈ ప్రాఫిలాక్టిక్ మెడిసిన్ మందులను విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. ప్రాఫిలాక్టిక్ మెడిసిన్ను ముందస్తుగా తీసుకోవడం వల్ల ప్రాణాంతక వైరస్ల బారి నుంచి తప్పించుకోవచ్చిన తెలంగాణ ఆయుష్ అధికారులు వెల్లడించారు. వాయు సంబంధ వ్యాధులు, వైరస్, జెనెటిక్ ప్రీడిస్పొజిషన్ వంటి రుగ్మతలను నిరోధించవచ్చని చెబుతున్నారు.
రామంతాపూర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లల్లో..
ప్రస్తుతం ఈ ప్రాఫిలాక్టిక్ మెడిసిన్ను రెండు చోట్ల అందుబాటులోకి తీసుకొచ్చారు ఆయుష్ అధికారులు. రామంతాపూర్లోని ధరమ్ కరణ్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల, శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి వాటికి సంబంధించిన ప్రత్యేక శిబిరాలను ఈ రెండు చోట్ల ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ కోసం ఉచితంగా మందులను పంపిణీ చేస్తుండటంతో ప్రజలు ఎగబడుతున్నారు.
మూడు రోజులు.. రోజూ ఆరు మాత్రలు..
రోజూ ఆరు మాత్రలు చొప్పున మూడు రోజుల పాటు ఈ ప్రాఫిలాక్టిక్ మాత్రలను వినియోగించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. అప్పుడే పుట్టిన శిశువుల దగ్గరి నుంచి ఒక ఏడాది లోపు వరకు ఉన్న పసికందులకు రోజూ మూడు మాత్రలను తల్లిపాలతో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు. ఏడాదిపైన ఉన్న వారు రోజూ ఆరు మాత్రలను భోజనం చేసిన అరగంట తరువాత గానీ, భోజనానికి అరగంట ముందు గానీ వాడాల్సి ఉంటుందని తెలిపారు.
Recommended Video
ప్రధాన ప్రాంతాల్లో శిబిరాల ఏర్పాటు..
ఈ హోమియోపతి మందులను ఉచితంగా పంపిణీ చేయడానికి జంటనగరాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను నెలకొల్పుతామని, ఈ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు చేపట్టామని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ, పాతబస్తీలోని ఉస్మానియా మొదలుకుని అన్ని ఆసుపత్రుల్లో వాటిని నెలకొల్పబోతున్నట్లు చెప్పారు. అలాగే- మహాత్మాగాంధీ సెంట్రల్ బస్స్టేషన్ సహా అన్ని రైల్వే స్టేషన్లలో మందులను పంపిణీ చేస్తామని అన్నారు.