రామోజీ రావు ఓం సిటీకి 505 ఎకరాలు దారాదత్తం
హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధ్యాత్మిక నగరం ఓం సిటీకి 505 ఎకరాల భూమిని దారాదత్తం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడింది. హైదరాబాదు నగరానికి సమీపంలో ఉండే రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్, కోహెడ, సూర్మాయిగుడా గ్రామాలకు చెందిన భూములను రామోజీ రావు ఓంసిటీకి ఇవ్వడానికి దాదాపుగా నిర్ణయమైంది.
ఆ భూములను ఓంసిటీకి అప్పగించడానికి తుది నిర్ణయం కోసం ఫైల్ను రెవెన్యూ శాఖకు పంపించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రతిపాదనను అంగీకరించిన తర్వాత భూమి విలువను ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది.
ఓంసిటీని 2 వేల ఎకరాల్లో నిర్మించాలని రామోజీ రావు తలపెట్టారు. తమకు భూమి కేటాయించాలంటూ రామోజీ రావు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకున్నారు. అయితే, అంత భూమి హయత్నగర్ మండలంలో ఒకే చోట దొరదని అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు.
మొత్తం మీద, అధికారులు 505 ఎకరాలను ఒకే చోటు గుర్తించారు. దాంతో ఆ ప్రాజెక్టుకు ఆ భూమిని అప్పగించాలని నిర్ణయించారు. ప్రైవేట్ పట్టాదారులతో సంప్రదింపులు జరిపి మిగతా భూమిని స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా రామోజీ రావు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.
ఓంసిటీలో దేశంలోని 108 ప్రసిద్ధ దేవాలయాల నమూనాలు రూపుదిద్దుకుంటాయి. దానికితోడు, థీమ్ పార్కు, సినిమా థియేటర్లు (ఆధ్యాత్మిక సినిమాలు మాత్రమే ప్రదర్శించడానికి), హోటళ్లు, మ్యారేజీ హాల్స్, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి.
ఈ ప్రాజెక్టు కోసం రామోజీ రావు గత రెండేళ్లుగా పనిచేస్తూ వస్తున్నారు. రామోజీ రావు ఏప్రిల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిసి ప్రాజెక్టు వివరాలకు సంబంధించిన ఓ పుస్తకాన్ని అందించారు. తగిన సహాయం చేస్తానని కెసిఆర్ హామీ కూడా ఇచ్చారు.
రామోజీ రావు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, దానికి సంబంధించిన ఆల్బమ్ను అందించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 3 వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగలవని అంచనా. అది పూర్తయితే ప్రతి రోజూ 2 లక్షల మంది విజిటర్స్ వస్తారని అంచనా వేశారు.