నిజామాబాద్కు మహార్దశ: వచ్చే ఏడాది నుంచి మరో డెంటల్ కాలేజీ
హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటు విషయంలో నిబంధనలను సడలిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో డెంటల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే గరిష్టంగా 40 లక్షల జనాభా ఉండాలనే నిబంధన ఉంది. 40 లక్షలు దాటితేనే రెండో కాలేజీకి అనుమతి ఇవ్వాలన్న నిబంధన ఉండేది.
అయితే తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని పట్టణాల్లో గత మూడు దశాబ్దాలుగా జనాభా పెరుగుదలలో పెద్దగా మార్పు రావడం లేదు. ఇందుకు ఉదాహరణ నిజామాబాద్. ఇలాంటి పరిస్థితుల్లో జనాభా ఆధారంగా డెంటల్ కాలేజీ ఏర్పాటుపై ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో నిబంధనను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో మరో డెంటల్ కాలేజీ ఏర్పాటుకు దరఖాస్తు వచ్చిన నేపథ్యంలో నిబంధన సడలింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ తాజా నిర్ణయంతో నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న డెంటల్ కాలేజీకి తోడు మరో కాలేజీ వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది.
16 పరిశ్రమలకు 'టీ' సర్కార్ అనుమతి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానానికి అనూహ్య స్పందన లభిస్తుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో మరో 16 పరిశ్రమలకు ప్రభుత్వం శనివారం అనుమతి పత్రాలు ఇవ్వనుంది.
ఈ 16 కంపెనీలు రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో రూ. 1570 కోట్లతో పెట్టుబడులు పెట్టనున్నాయి. 1,812 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.