గోల్కొండ కోటలో జీఈఎస్ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం విందు..
హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్కు హాజరైన 150 దేశాలకు చెందిన 1500 మంది విదేశీ ప్రతినిధులకు బుధవారం రాత్రి గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ : హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్కు హాజరైన 150 దేశాలకు చెందిన 1500 మంది విదేశీ ప్రతినిధులకు బుధవారం రాత్రి గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, టెన్నిస్ స్టార్ సానియామీర్జా, బీజేపీ నేతలు దత్తాత్రేయ, కిషన్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ పలువురు ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు.
విదేశీ ప్రతినిధులంతా బుధవారం రాత్రి 45 మినీ బస్సుల్లో గోల్కొండ కోటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుస్సాడి కళాకారులతో కలిసి విదేశీ ప్రతినిధులు నృత్యం చేసి సందడి చేశారు.
గోల్కొండ కోటలోని పచ్చిక బయళ్లలో ఈ విందు జరుగింది. ఈ విందులో అతిథులకు తెలంగాణ, హైదరాబాదు ప్రతిష్ఠను ఇనుమడింపజేసే ఘుమఘుమలాడే వంటకాలను వడ్డించారు.
విదేశీ రుచులతో పాటు బిర్యానీ, మొఘలాయ్, ఇటాలియన్, చైనీస్ రకాల వంటకాలు విదేశీ ప్రతినిధులను ఆకట్టుకున్నాయి. ప్రకృతి, కోట అందాలను వీక్షిస్తూ అతిథులు డిన్నర్ ను ఆస్వాదించారు.
రెండ్రోజుల పాటు సదస్సు చాలా సంతృప్తికరంగా సాగిందని పలువురు ప్రతినిధులు తెలిపారు. సదస్సులో ఎన్నో తీర్మానాలు చేయడంతో పాటు ఇవాంకట్రంప్ రాకతో అమెరికా-భారత్ సంబంధాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు ప్రతనిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.