మాట నిలబెట్టుకున్న కేసీఆర్: రెవెన్యూ డివిజన్గా హుజూర్నగర్, నోటిఫికేషన్ రిలీజ్
హైదరాబాద్: హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడు మండలాలతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు నోటిఫికేషన్లో ప్రభుత్వం వెల్లడించింది.
ఇటీవల హుజూర్నగర్లో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే రెవెన్యూ డివిజన్పై తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు కోదాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం(మల్లారెడ్డిగూడెం) మండలాలతోపాటు సూర్యాపేట డివిజన్లోని గరిడేపల్లి, పాలకీడు, నేరేడుచర్ల మండలాలతో హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కాగా, కేసీఆర్ హుజూర్నగర్ కృతజ్ఞత సభలో వరాల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. హుజూర్నగర్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాలు కురిపంచారు. నియోజకవర్గంలో గల 134 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులను కేటాయిస్తున్నానని ప్రకటించారు. 7 మండల కేంద్రాలకు రూ.30 లక్షలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ నిధులకు సంబంధించి రెండు, మూడురోజుల్లో జీవో విడుదలవుతుందని పేర్కొన్నారు.
హుజూర్నగర్ పట్టణానికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. నేరుడుచర్లకు కూడా రూ.15 కోట్లు అందిస్తామని పేర్కొన్నారు. హుజూర్ నగర్ను డివిజన్ చేస్తామని హామీనిచ్చారు. గిరిజనుల చిరకాల కోరిక తండాలను పంచాయతీలుగా మార్చింది తామేనని పేర్కొన్నారు. తమ హయాంలో 3 వేల తండాలు, గూడెలను ప్రభుత్వం పంచాయతీలుగా చేసిందని పేర్కొన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో కూడా 30 తండాలు పంచాయతీలుగా మారాయనే విషయాన్ని గుర్తుచేశారు.