కేసీఆర్ సర్కార్ హైఅలర్ట్: తక్షణ ఉత్తర్వులు: అలాంటి ఘటన సంభవించకూడదంటూ..
హైదరాబాద్: తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో చోటు చేసుకున్న పెను అగ్నిప్రమాదం అనంతరం కీలక నిర్ణయాలను తీసుకుంది. కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించడానికి తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో కోవిడ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ఇతర భవన సముదాయాల్లో వాటిని ఏర్పాటు చేశారు. వేలమంది కరోనా వైరస్ పేషెంట్లు వాటిల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 22 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Recommended Video
కోవిడ్ కేర్ సెంటర్లలో భద్రతా ప్రమాణాలు..
ఆయా సెంటర్లలో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం సమాయాత్తమౌతోంది. ప్రైవేటు ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లలో అగ్నిమాపక సంబంధిత భద్రతా ప్రమాణాలను తప్పనిసరి చేసింది కేసీఆర్ సర్కార్. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. తెలంగాణ ప్రజా వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక నిబంధనలను పాటించని కోవిడ్ సెంటర్లపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి కోవిడ్ సెంటర్ కూడా అగ్నిమాపక నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు.
స్వర్ణ ప్యాలెస్ తరహా ఉదాంతాలపై..
కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు చికిత్స అందిస్తోన్న ఏ ఒక్క ప్రైవేటు ఆసుపత్రిలో గానీ, కోవిడ్ కేర్ సెంటర్లో గానీ అగ్ని ప్రమాదం సంభవిస్తే.. దాని ఫలితం ఎలా ఉంటుందనేది విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్ ఘటనతో తేటతెల్లమైంది. ఈ ఘటనలో 11 మంది పేషెంట్లు దుర్మరణం పాలయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన ఈ అగ్నిప్రమాదం.. స్వర్ణ ప్యాలెస్ హోటల్ భవన సముదాయంలో గల అవకతవకలను వెలుగులోకి తీసుకొచ్చింది. అలాంటి సంఘటనలు తమ రాష్ట్రంలో చోటు చేసుకోకుండా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది.
20 వేలకు పైగా కరోనా బెడ్స్..
తెలంగాణ వ్యాప్తంగా 20,396 పడకల సామర్థ్యంతో వేర్వేరు జిల్లాలు, ప్రాంతాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రెగ్యులర్ బెడ్స్ -12,284, ఆక్సిజన్ బెడ్స్-5,861, ఐసీయూ బెడ్స్-2,251 ఉన్నాయి. వాటిల్లో చాలావరకు స్వర్ణ ప్యాలెస్ వంటి భవన సముదాయాల్లో కొనసాగుతున్నాయి. వేలాదిమంది ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలకు దిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా ఉత్తర్వులను జారీ చేసింది.
చట్టపరమైన చర్యలకు సిద్ధం కావాల్సిందే..
అగ్నిమాపక నిబంధనలను పాటించని ప్రైవేటు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లపై కఠిన చర్యలను తీసుకుంటామని ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ హెచ్చరించారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను తీసుకున్న తరువాతే.. కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజీధోరణిని కనపరిచ కూడదని స్పష్టం చేశారు. ఎన్ఓసీ తీసుకోకుండా.. ఎలాంటి భద్రతా ప్రమాణాలను పాటించకుండా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసే వారిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని డైరెక్టర్ హెచ్చరించారు. ఎలాంటి అవాంఛిత సంఘటనలకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు.