కల్నల్ సంతోష్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం.. విచక్షణాధికారాలు ఉపయోగించిన సీఎం కేసీఆర్..
భారత్, చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న తెలంగాణ ప్రభుత్వం తన వాగ్ధానాన్ని ఆచరణలో పెట్టింది. కల్నల్ సంతోష్ కుటుంబానికి పరిహారం, ఆయన భార్య సంతోషికి ప్రభుత్వ ఉద్యోగంపై సర్కారు అధికార ఉత్తర్వులను సిద్ధం చేసింది.
తమిళనాడులో భారీగా వైఎస్ జగన్ పోస్టర్లు.. కొత్త రాజకీయ పార్టీకి ఆదర్శం.. ఆ హీరోనే సీఎం అంటూ..
సూర్యాపేటకు సీఎం..
కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని దర్శించేందుకు వెళ్లకపోవడంపై బీజేపీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు సీఎం తీరును విమర్శించడం తెలిసిందే. నాడు పని ఒత్తిడి వల్ల హకీంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లలేకోపోయిన సీఎం.. సోమవారం నేరుగా సూర్యాపేటలోని సంతోష్ బాబు ఇంటికి వెళ్లి, అమరుడి కుటుంబీకులను పరామర్శించనున్నారు. ఆ కుటుంబానికి సర్కారు అందించే సాయం, సంతోషి ఉద్యోగానికి సంబంధించిన నియామక ఉత్తర్వులను సీఎం స్వయంగ అందజేయనున్నారు.
విచక్షణాధికారాలతో..
అమరుడైన సంతోష్ బాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడైంది. ముఖ్యమంత్రి తన విచక్షణాధికారాలతో ఎవరినైనా గ్రూప్-1 స్థాయి దాకా ఉన్న పస్టుల్లో నియమించే అవకాశం ఉన్నది. సంతోషి విషయంలోనూ సీఎం తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఉత్తర్వులకు ఆదేశించారు. సూర్యాపేటలోని సంతోష్ ఇంటిని సందర్శించే సందర్భంలో సంతోషికి నియామక ఉత్తర్వులను సీఎం స్వయంగా అందజేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
షేక్ పేటలో స్థలం..
దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు ఎంత చేసినా తక్కువే అవుతుందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి తోడు రాష్ట్రాలు కూడా ఆదుకున్నప్పుడే సైనికుల కుటుంబాలకు భరోసా కల్పించినట్లుగా ఉంటుందని సీఎం కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేశారు. కల్నల్ కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయం, ఇంటి స్థలం ఇస్తామన్న ప్రభుత్వం.. ఆ మేరకు జీవోలన కూడా సిద్ధం చేసింది. హైదరాబాద్ లోని షేక్ పేటలో గల 500 గజాల స్థలాన్ని కల్నల్ కుటుంబీకులకు కేటాయిస్తూ రూపొందించిన జీవో కాపీని కూడా.. రూ.5 కోట్ల చెక్కుతోపాటే ముఖ్యమంత్రే అందజేయనున్నారు.
పూర్తయిన అస్థికల నిమజ్జనం..
కల్నల్ సంతోష్ బాబు అస్థికలను కృష్ణా-మూసీ నదీ సంగమంలో నిమజ్జనం చేశారు. సూర్యాపేట జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి వద్ద.. కృష్ణా, మూసీ నదులు కలిసే చోట పూజల అనంతరం కుటుంబీకులు మర పడవల్లో వెళ్లి అస్థికలను నిమజ్జనం చేశారు. జాతీయ జెండాలు చేతబట్టుకున్న జనం.. దారి పోడవునా కల్నల్ కుటుంబంపై పూలు చల్లుతూ, అమరుడి ఆత్మకు శాంతికలగాలని నినాదాలు చేశారు.
Recommended Video
పిల్లలు కోరితే ఆర్మీకి పంపుతా..
ఓ వైపు భర్తను కోల్పోయినా, దేశ సేవకోసం తన పిల్లల్ని సైతం పంపుతానని కల్నల్ సంతోష్ భార్య సంతోషి ధీమాగా చెప్పారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. పలు మీడియా సంస్థలతో ఆమె మాట్లాడారు. ‘‘నా భర్త(సంతోష్) పిల్లల్ని చాలా బాగా చూసుకునేవారు. వాళ్లకు రోల్ మోడల్ గా నిలిచారు. మా పిల్లలు పెద్దవారయ్యాక.. ఆర్మీలో చేరానంటే సంతోషంగా పంపుతాను. పిల్లల గురించి మేమిద్దరం ఎన్నో కలలు కన్నాం. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది..''అని సంతోషి కన్నీటిపర్యంతమయ్యారు.