ట్యాంక్బండ్..ఎన్టీఆర్ గార్డెన్స్ ఇలా ఉండబోతున్నాయ్: 125 అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహం
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు చెందిన మరో ఎత్తైన విగ్రహం రూపుదిద్దుకోబోతోంది. హైదరాబాద్ ట్యాంక్బండ్కు ఆనుకునే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్లోని పార్టీ జోన్లో దీన్ని ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. ఇప్పటికే విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదే సమయంలో- తెలంగాణ ప్రభుత్వమూ అదే దిశగా అడుగులు వేసింది. దీనికి సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం ఆవిష్కరించింది.
నిర్మలమ్మ మేజిక్: ట్యాక్స్ పేయర్లకు ఊరట: ఆర్డినెన్స్ స్థానంలో: కాస్సేపట్లో లోక్సభలో బిల్లు
146 కోట్ల రూపాయలు..
అంబేద్కర్ విగ్రహం, మెమొరియల్ పార్క్ను ఏర్పాటు చేయడానికి 146 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. 45.5 అడుగుల వెడల్పుతో.. 791 టన్నుల స్టీల్ ఉపయోగించి, 96.19 టన్నుల కాంస్యంతో ఈ విగ్రహాన్ని నిర్మించబోతోంది. ఎన్టీఆర్ గార్డెన్స్లోని పార్టీ జోన్లో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన నమూనాను మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పులు ఈశ్వర్, సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు.
మ్యూజియం.. లైబ్రరీ..
ఈ విగ్రహం ఏర్పాటుతో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. సరికొత్త అందాలను సంతరించుకుంటాయి. రాష్ట్రానికి తలమానికంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మ్యూజియం, గ్రంధాలయంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. బాబా సాహెబ్ 125వ జయంతి సందర్శంగా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, దాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ భారీవిగ్రహం ఏర్పాటుకు అనుమతులకు సంబంధించి జీవోను ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు.
విజయవాడలోనూ..
ఇదే తరహాలో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో ఈ విగ్రహాన్ని నిర్మించబోతోంది. దీనికి అవసరమైన పనులు నవంబర్ 1వ తేదీన ఆరంభం కావచ్చని తెలుస్తోంది. పనులను మొదటు పెట్టిన తేదీ నుంచి 13 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. విగ్రహ పనులపై ఇటీవలే ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Recommended Video
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో..
జులై 8న ఈ నిర్మాణ పనులకు వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. విగ్రహంతో పాటు, అంబేద్కర్ స్మారక భవనం, గ్రంథాలయం, ఓపెన్ ఎయిర్ థియేటర్, మ్యూజియం అక్కడా ఏర్పాటు కానున్నాయి. మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో స్మారక మెమోరియల్ ఏర్పాటు కానుంది. నిర్మాణ పనులను సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తోంది. మున్సిపల్ సహా పలు శాఖలు సమన్వయం చేసుకుంటాయి. ఇదివరకు ఈ స్థలం జలవనరుల శాఖ పరిధిలో ఉండగా దీన్ని సాంఘిక సంక్షేమశాఖకు బదలాయించారు.