హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యపై మంత్రి కేటీఆర్ ప్రణాళికలివే
హైదరాబాద్: ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఖైరతాబాద్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జీహెచ్ఎంసీపై జరిగిన వర్క్షాప్లో శనివారం ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్లోని మౌలిక అంశాలపై ముందుగా దృష్టిసారిస్తున్నామన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉత్తమ విధానాలను పరిశీలించి అనుసరిస్తామని చెప్పారు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మార్గాలు వెతుకుతున్నామని ఆయన చెప్పారు.
వివిధ నగరాల్లో అమలవుతున్న పద్ధతులపై అధ్యయనం చేస్తామన్నారు. త్వరలో పలునగరాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు బెంగళూరులో పర్యటించి అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తామన్నారు.
హైదరాబాద్ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తామన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలను అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్లో మార్చి మొదటి వారంలో జాతీయస్థాయి నిర్మాణ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చిస్తామన్నారు.
ఇదిలా ఉంటే శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లా శామీర్పేట మండలంలోని బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో రూ.370కోట్లతో చేపట్టనున్న రెండో దశ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శామీర్పేట మండలంలో నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయం, బిట్స్ పిలానీ క్యాంపస్ లాంటి అంతర్జాతీయ విద్యా సంస్థలు ఉన్నందున ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామన్నారు.