ఆర్థిక ఇబ్బంది, 'ఫుడ్స్' డబ్బు ఇవ్వండి: ఏపీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ
హైదరాబాద్: తెలంగాణ ఫుడ్స్ సంస్థకు రూ.98 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. జూన్ నుంచి నవంబర్ వరకు ఏపీలోని అంగన్వాడీ కేంద్రాలకు సంస్థ ఆహారాన్ని సరఫరా చేసింది.
జూన్ నుంచి నవంబర్ వరకు అంగన్వాడీ కేంద్రాలకు ఆహారం సరఫరా చేయగా ఇప్పటి వరకు నిధులు విడుదల చేయాలేదని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల తమ సంస్థ ఆర్థిక సమస్యలలో కూరుకుపోయిందని వెల్లడించింది. తెలంగాణ ఫుడ్స్ సంస్థను ఆదుకోవాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖను ఆదేశించింది.
మరోవైపు బ్యాంకు ఖాతాలో ఉమ్మడి రాష్ట్రం హయాంలో జమ అయిన రూ.58కోట్ల నిధులు ఫ్రీజ్ అయిన విషయం తెలుసుకొని వెంటనే వాటిని విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మూడు గ్రామాల్ని దత్తత తీసుకున్న పల్లా
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్రామజ్యోతి పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలంలోని సోదేశ్పల్లి, మల్లికుదుర్ల, గుండ్లసాగర్ గ్రామాలను దత్తత తీసుకున్నట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు. పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు మూడు రోజులుగా ఆయా గ్రామాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం చెప్పారు.
సోదేశ్పల్లి, మల్లికుదుర్ల, గుండ్లసాగర్లలో మూడు రోజులుగా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పెద్దల సహకారంతో గ్రామసభలు నిర్వహించానని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై దిశా నిర్దేశం చేశామన్నారు.
రానున్న రెండు నెలల్లో ప్రతి ఇంట్లో మరుగు దొడ్డి ఏర్పాటు, వంద శాతం పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యలపై చర్చించామన్నారు. మూడు రోజులుగా సన్నాహక సమావేశాలతో పాటు శ్రమదానం నిర్వహించి, రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్ల చెట్లను తొలగించామన్నారు.