తెలంగాణకు మూడేళ్లు: రాజకీయాల్లోనే కెసిఆర్ సూపర్, మిగతావన్నీ....
కే చంద్రశేఖర్రావు సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరి మూడేళ్లయింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం జరిగిన యావత్ తెలంగాణ ప్రజానీకం ఉజ్వల భవిష్యత్ కోసం కోటి ఆశలు పెట్టుకున్నారు.
హైదరాబాద్: సబ్బండ తెలంగాణ ప్రజానీకం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటై ఇప్పటికి మూడేళ్లు పూర్తయింది. అలాగే సీఎం కే చంద్రశేఖర్రావు సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరి మూడేళ్లయింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం జరిగిన యావత్ తెలంగాణ ప్రజానీకం ఉజ్వల భవిష్యత్ కోసం కోటి ఆశలు పెట్టుకున్నారు.
ఉమ్మడి ఆంధ్ర పాలకుల వ్యంగ్యాలు, బెదిరింపుల మధ్య మొదలైన తెలంగాణ కొత్త జీవితం మొదలైంది. రాష్ట్ర సాధన ఉద్యమ సారధిగా పాలనా పగ్గాలు అందుకున్న కేసీఆర్ ముందు పలు లక్ష్యాలు, సవాళ్లు ఉన్నాయి.గతంలో మంత్రిగా పనిచేసినా, నూతన వ్యవస్థలో ప్రభుత్వానికి సారథ్యం వహించడంలోనూ తన రాజకీయ అనుభవాన్ని రంగరించి మరీ పాలనకు శ్రీకారం చుట్టారు.
ఈ క్రమంలో ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ముందు ఉన్నట్లు ప్రకటించినా ఆచరణలో సవాళ్లు వెంటాడుతూనే ఉన్నాయి. అందులో సాగునీటి ప్రాజెక్టులు, డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం, ఉద్యోగాల కల్పన, రాజకీయ నిర్ణయాలతో విభేదాల సవాళ్లు ఎదురవుతున్నాయి.
ఇలా దత్తత గ్రామాల్లో ఇళ్లు
ఎన్నికల వేళ నిరుపేద ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాల్లో.. అంతకుముందు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం దిగ్విజయంగా పూర్తిచేశారు. ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాలకు కట్టించిన డబుల్ బెడ్రూం ఫొటోలు మీడియాలో చూసిన రాష్ట్ర ప్రజలకు ఒకింత కన్నుగుట్టిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
లక్షల దరఖాస్తుల్లో అర్హుల గుర్తింపు క్లిష్టమే
రాష్ట్రవ్యాప్తంగా 2.6 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ఏడాది లోగా లక్ష ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం ముందుకు సాగుతున్నా అంతా నత్తనడకన సాగుతున్నది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు రావడం లేదు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఇండ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. హైదరాబాద్ నగరమంతటా 868 ఇళ్ల నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోనూ పథక నిర్మాణం సాగుతున్నది. అయితే లక్షల్లో దరఖాస్తులు రావడంతో అర్హులను గుర్తించడం అధికారులకు తలకు మించిన భారంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ నిబంధనలు ఇలా అవరోధం
దళితులకు మూడెకరాల భూమి పంపిణీ పంపిణీ పథకం కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నది. మూడేళ్లలో కేవలం 10 వేల ఎకరాల భూమి మాత్రమే లబ్దిదారులకు ప్రభుత్వం పంపిణీ చేయగలిగింది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలు, ధరలకు భూమి విక్రయాలు ప్రజలు ముందుకు రాకపోవడమే ‘దళితులకు మూడెకరాల భూమి పంపిణీ' అమలుకు ప్రధాన అవరోధంగా ఉన్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సింగరేణి డిపెండెండ్లకు ఇలా కోర్టు గోడలు ఇలా
మరో ప్రధాన హామీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలోనూ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కానీ ఆ నిర్ణయానికి న్యాయస్థానాలు అడ్డుచెప్పాయి. ఇక సింగరేణిలో వారసులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు అడ్డుకున్నది.
ఉద్యోగ నియామకాలు పదివేల లోపే
తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్లలో నియామకాల కల్పన ప్రధానమైంది. ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలులో పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 30 వేల ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేసినా.. ఆచరణలో నియామక ఉత్తర్వులు జారీ అయినవి కేవలం పది వేల లోపే. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే రెండేళ్లలో ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారన్నదీ నీటి మీద రాతలేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫీజు రీయింబర్స్మెంట్పై ఇలా
ఉమ్మడి రాష్ట్ర హయాంలో ఐదేళ్లలోపు ఒక్క డీఎస్సీ ద్వారానైనా నియామకాల ప్రక్రియ సాగేది. కానీ తెలంగాణలో 2004 తర్వాత ఉపాధ్యాయుల నియామకాలే జరుగలేదు. సుప్రీంకోర్టు కూడా అక్షింతలు వేసింది. త్వరలో భారీగా నియామక ప్రక్రియ చేపడతామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి చేసిన ప్రకటన ఏ మేరకు అమలుకు నోచుకుంటుందో వేచి చూడాల్సిందే మరి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆసుపత్రులు సహా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాం నుంచి అమలవుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దాదాపుగా నిలిపేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్పై ఇలా
అన్నింటికన్నా ప్రధాన డిమాండ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం. తెలంగాణ మీదుగా క్రుష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నా సబ్బండ వర్ణాలకు సాగునీరు లేక.. అత్యధికంగా వ్యవసాయం సాగు భూగర్భ జలాలపైనే సాగుతున్నది. క్రుష్ణా జలాలను దాదాపు ఆంధ్రప్రదేశ్ ఎగరేసుకుపోయింది. ఇక గోదావరి నదీ జలాల్లో.. దాని ఉప నదులు ప్రాణహిత తదితర ఉప నదుల జలాలే కీలకం. క్రుష్ణా నదీ తలాపునే ఉన్న మహబూబ్ నగర్ - రంగారెడ్డి జిల్లాలతోపాటు నల్లగొండ జిల్లాకు సాగునీరందించేందుకు రంగారెడ్డి - పాలమూరు లిఫ్ట్, డిండి లిఫ్ట్ పథకాల అమలుకు పూనుకున్నది. ఇదే 2003లో మొదలైన పాలమూరు లిఫ్ట్ దాదాపు పూర్తి దశకు చేరుకున్న దశలో తెలంగాణ ఏర్పాటు కావడంతో ఆ పథకం శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది.
కోటి ఎకరాలకు సాగునీరు ఇలా
గోదావరి నదిపై ప్రాణహిత - చేవెళ్ల కింద కాళేశ్వరం, ఏటిగడ్డ, దిగువ మానేరు, మల్లన్నసాగర్, తద్వారా ఎఎస్సారెస్పీకి గోదావరి నది నీళ్లు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణ తన నినాదమని సీఎం కేసీఆర్, రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు పదేపదే చెప్తూ వచ్చారు. మరి వచ్చే రెండేళ్లలో ఏ మేరకు పూర్తిచేసి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తారా? లేదా? అన్నది భవిష్యత్ చిత్రపటంపై చూడాల్సిందే.