ఆన్లైన్ క్లాసులపై హైకోర్టులో విచారణ...ధర్మాసనం ఏం చెప్పిందంటే..?
హైదరాబాదు: ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. అసలు ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలంటూ ధర్మాసనం ఆదేశించింది. ఆన్లైన్ క్లాసులు, ఫీజులు వసూలు చేయరాదంటూ ఓ న్యాయవాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిని విచారణ చేసింది న్యాయస్థానం. జూలై 31వరకు స్కూళ్లు నిర్వహించరాదని చెప్పిన ప్రభుత్వం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఎలా ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే దీనిపై కమిటీ ఏర్పాటు చేశామని చెప్పిన ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చేందుకు కాస్త సమయం ఇవ్వాలని న్యాయస్థానంను కోరింద. .
ఇక ఇదే అంశానికి సంబంధించి మరో పిటిషన్పై వాదనలు వినింది న్యాయస్థానం. ఇప్పటికే సీబీఎస్ఈ ఐసీఎస్ఈ సిలబస్ బోధిస్తున్న బడా స్కూళ్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న దానిపై కూడా విచారణ జరిగింది. అయితే ఈ స్కూళ్ల తరపున వాదించిన న్యాయవాదికి పలు ప్రశ్నలు సంధించింది. సెంట్రల్ సిలబస్ అంటే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ బోధిస్తున్న స్కూళ్లు ఆ బోర్డు ఆదేశాల ప్రకారం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని ధర్మాసనంకు తెలిపింది. అయితే విద్యార్థులు అంత సమయం కంప్యూటర్ ముందు కూర్చొంటే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది.
విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఇందుకు సమాధానంగా వాలంటరీ అనే ఆప్షన్ ఇచ్చామని ఈ స్కూళ్ల తరపున వాదిస్తున్న న్యాయవాది ధర్మాసనంకు చెప్పారు. విద్యార్థులు వారి ఇష్టం మేరకే ఆన్లైన్ తరగతులకు హాజరు కావొచ్చని తాము చెప్పామని న్యాయస్థానంకు వివరించింది.
Recommended Video
అయితే స్కూళ్ల సమాఖ్య తరపున వాదించిన న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. వాలంటరీ అనే ఆప్షన్ ఉన్నప్పుడు విద్యార్థులు ఎలా హాసరవుతారని ప్రశ్నించింది. అంతేకాదు ఒక విద్యార్థి ఆన్లైన్ క్లాసులు హాజరవుతున్నప్పుడు మరో విద్యార్థి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేలా ఒత్తిడి తీసుకొస్తారని అలాంటప్పుడు ఇది వాలంటరీ ఎలా అవుతుందని ప్రశ్నించింది. దీనిపై పూర్తి స్పష్టతతో పాటు విధివిధానాలను రూపొందించి తిరిగి న్యాయస్థానం ముందు హాజరుకావాలని పేర్కొంటూ కేసును ఈ నెల 22కు వాయిదా వేసింది.