రాయలసీమ ఎత్తిపోతలపై విచారణ నిరవధిక వాయిదా వేసిన తెలంగాణా హైకోర్టు ... కారణం ఇదే !!
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్ లో ఉన్న సమయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేవరకు హైకోర్టులో పిటిషన్ పై విచారణను నిరవధికంగా వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
Recommended Video
రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీం కోర్టుకు వెళ్ళండి ... హైకోర్టు పరిధిలోది కాదన్న ధర్మాసనం
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రక్రియను నిలిపి వేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ నేత వంశీచంద్ రెడ్డి, సామాజిక కార్యకర్త శ్రీనివాస్ వేసిన పిటిషన్లపై హైకోర్టు గత రెండు రోజులుగా విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా నిన్నటికి నిన్న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు హైకోర్టు పరిధిలోకి ఎలా వస్తాయని ప్రశ్నించిన ధర్మాసనం, ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని సూచించింది.
నేడు విచారణలో భాగంగా ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణ పరిధి ఉందని తెలంగాణ ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించారు. అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతోందని, పనులను ఆపాలని ఆదేశించాలని కోరారు. అయితే ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదు అని ప్రశ్నించింది ధర్మాసనం. ఇదే సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది ఏపీ ప్రభుత్వం టెండర్లకు వెళ్లడానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా అనుమతి ఇచ్చిందని, ఇది చాలా అభ్యంతరకరమైనదని పేర్కొన్నారు. అయితే ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదని హైకోర్టు ప్రశ్నించింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశామని, అన్ని అంశాలు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయని ఏపీ ఏజీ శ్రీరామ్ న్యాయస్థానానికి వివరించారు. సుప్రీం కోర్టు పరిధిలో ఈ అంశం ఉన్నప్పుడు, హైకోర్టు విచారణ దేనికి అంటూ ప్రశ్నించిన ధర్మాసనం సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఈ పిటిషన్ పై విచారణ నిరవధిక వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయిన తర్వాత తిరిగి పిటిషనర్లు తమ దృష్టికి తీసుకు రావచ్చు అని తెలంగాణ హైకోర్టు సూచించింది.